వాషింగ్టన్: భారతీయ విద్యార్థులపై దాడులను నిరోధించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన పరిపాలనా యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించింది. శ్వేత సౌధంలోని జాతీయ భద్రతా మండలిలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ల విభాగం సమన్వయకర్త జాన్ కిర్బీ విలేకర్లతో మాట్లాడుతూ ఈ వివరాలను తెలిపారు.
భారతీయ విద్యార్థులపై ఇటీవల జరిగిన దాడుల గురించి విలేకర్లు ప్రశ్నించినపుడు కిర్బీ స్పందిస్తూ, జాతి, స్త్రీ, పురుష, మత, ఇతర అంశాల ఆధారంగా జరిగే హింసను క్షమించేది లేదన్నారు. అమెరికాలో అటువంటి హింస ఆమోదయోగ్యం కాదన్నారు. ఇటువంటి దాడులను నిలువరించేందుకు రాష్ర్టాలు, స్థానిక అధికారులతో కలిసి జో బైడెన్ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.