వాషింగ్టన్/బీజింగ్: గత మూడు రోజులుగా తమ గగనతలంపై తిరుగుతున్న అనుమానాస్పద చైనా నిఘా బెలూన్ను అమెరికా తాజాగా పేల్చివేసింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలకు మేరకు శుక్రవారం అట్లాంటిక్ సముద్రంలో ఆ బెలూన్ను కూల్చివేసినట్టు రక్షణశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అత్యాధునిక యుద్ధవిమానం ఎఫ్-22ను రంగంలోకి దించిన ఆమెరికా.. ఎయిర్ ఇంటర్సెప్ట్ క్షిపణి 9 ఎక్స్ సైడ్విండర్ను ప్రయోగించి చైనా నిఘా బెలూన్ను పేల్చివేసింది.
ప్రస్తుతం అమెరికా సైన్యం ఆ బెలూన్ శకలాలను సేకరించే పనిలో పడ్డది. ఓ భారీ క్రేన్తో కూడిన రెండు నౌకాదళ షిప్లు ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. శకలాల ఆధారంగా నిఘా అంశంపై అమెరికా ఓ నిర్ధారణకు రానున్నది. ఈ బెలూన్ పౌర గగన నౌక అని, వాతావరణ పరిశోధనల కోసం ప్రయోగించిన ఈ బెలూన్ దారితప్పిందని చైనా చెబుతుండగా.. తమ దేశంలోని వ్యూహాత్మక స్థావరాలపై నిఘా పెట్టేందుకు చైనా దీన్ని ప్రయోగించిందని అమెరికా పేర్కొంటున్నది.
బెలూన్ పేల్చివేతపై చైనా తీవ్రంగా స్పందించింది. అది వాతావరణ పరిశోధనల కోసం ప్రయోగించినదని చెప్తున్నప్పటికీ దాన్ని కూల్చివేసిందని, దీనికి పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని ఆ దేశ విదేశాంగ శాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది.