వాషింగ్టన్, ఏప్రిల్ 29: అమెరికా హెచ్1-బీ వీసా లాటరీ వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకున్నాయని అమెరికా వెల్లడించింది. ఈ నేపథ్యంలో మోస, దుర్వినియోగ పద్ధతులను తొలగించడం ద్వారా హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధునీకరించినట్టు ఒక యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ వెల్లడించింది. కొన్ని కంపెనీలు నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల వీసాల కోసం కోసం కృత్రిమంగా కంప్యూటరైజ్డ్ డ్రాయింగ్ లాటరీ దరఖాస్తులను చాలాసార్లు సమర్పిస్తున్నాయని, ఈ నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ఏజెన్సీ తెలిపింది. అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ(యూఎస్సీఐఎస్) శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం 2023, 2024 ఆర్థిక సంవత్సరాల్లో హెచ్-1బీ క్యాప్ సీజన్లలో మోసపూరిత పిటిషన్లను గుర్తించి తొలగించినట్టు తెలిపింది. ఈ మోసాలపై క్రిమినల్ నేరాభియోగాల నమోదుకు సిఫారసు చేసినట్టు చెప్పింది.
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): అమెరికా వెళ్లి చదువాలనుకొనే విద్యార్థులకు హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ తీపికబురు అందించింది. విద్యార్థి వీసాల కోసం వచ్చే నెల రెండో వారం తర్వాత అపాయింట్మెంట్లు ప్రారంభం అవుతాయని శనివారం వెల్లడించింది. ప్రస్తుతం మొదటి బ్యాచ్కు ఇంటర్వ్యూలు జరుగుతాయని, అదనపు అపాయింట్మెంట్లు తర్వాత కేటాయిస్తామని పేర్కొన్నది. విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించింది.