లండన్, ఫిబ్రవరి 24: మార్కెట్ నుంచి వారానికి సరిపడా కూరగాయలు తెచ్చి ఫ్రిజ్లో పెట్టుకోవడం అందరి ఇండ్లలోనూ చేసే పని. ఆలుగడ్డలు మాత్రం ఫ్రిజ్లో పెట్టరు. నిపుణులు కూడా చాలా ఏండ్లుగా ఇదే మాట చెప్తున్నారు. ఫ్రిజ్లో పెడితే ఆలుగడ్డల్లో చక్కెర శాతం పెరుగుతుందని, వాటిని ఫ్రై, రోస్ట్ చేసినప్పుడు క్యాన్సర్కు కారణమయ్యే యాక్రిలామైడ్ ఏర్పడుతుందని చెప్తూ వస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ విషయంలో శాస్త్రవేత్తలు మనసు మార్చుకొన్నారు.
ఆలుగడ్డలు ఫ్రిజ్లో పెట్టినా ప్రమాదమేమీ ఉండదని, పైగా త్వరగా పాడవకుండా ఉంటాయని యూకేలోని ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ పరిశోధనలో వెల్లడైంది. అయితే, ఫ్రిజ్ నుంచి తీసి నేరుగా తినడం మాత్రం మంచిది కాదని పేర్కొంటున్నారు.