వాషింగ్టన్: ఏదైనా పాతకాలం నాటి అరుదైన వస్తువు దొరికితే మనం ఏం చేస్తాం? దాన్ని భద్రంగా దాచిపెట్టుకుని మురిసిపోతాం. కానీ అమెరికాకు చెందిన ఓ యువతి మాత్రం అలా చేయలేదు. తనకు దొరికిన ఓ బంగారు ఉంగరాన్ని.. దాన్ని పోగొట్టుకున్న వ్యక్తికి చేర్చేవరకు విశ్రమించలేదు. అందుకోసం ఏకంగా డిటెక్టివ్ అవతారమెత్తి చివరకు అనుకున్నది సాధించింది.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని బ్రోక్పోర్ట్కు చెందిన మేరీ జో ఓర్జెక్కు లాక్కవన్నా నగరంలో తన పూర్వీకులకు చెందిన ఇల్లు ఉంది. గతేడాది ఆ ఇంటిని సర్దుతుండగా ఓర్జెక్కు ఓ అరుదైన ఉంగరం దొరికింది. నీలి వర్ణం రాయి పొదిగిన బంగారు ఉంగరం అది. అయితే అది తన పూర్వీకులది కాదని నిర్ధారించుకున్న ఓర్జెక్.. అది ఎవరిదో తెలుసుకుని వారి వద్దకు చేర్చాలని నిర్ణయించుకుంది.
ఆ మేరకు ఉంగరం గురించి ఆరా తీస్తూ లాక్కవన్నాలో తన తండ్రి చదివిన పాఠశాలకు వెళ్లింది. అక్కడ ఉన్న లైబ్రేరియన్ను సంప్రదించగా.. ఉంగరంపై ఉన్న ‘ఈఎల్డీ’ అనే అక్షరాల ఆధారంగా అది ఆ పాఠశాలలో చదివిన 1955 బ్యాచ్ విద్యార్థికి చెందినదిగా గుర్తించారు. అయితే ఆరు దశాబ్దాల క్రితం నాటి రిజిస్టర్ వారికి అక్కడ లభించలేదు.
దాంతో ఓర్జెక్ ఆ పాఠశాల మాజీ లైబ్రేరియన్ సుసాన్ పలుంబోని సంప్రదించింది. తన వద్ద ఉన్న వివరాలను ఆయనకు వివరించింది. ఆ మాజీ లైబ్రేరియన్ 1955 నాటి రిజిస్టర్ను వెలికితీసి అది యూజీన్ డార్మ్స్టెడ్టర్ అనే వ్యక్తిదిగా తెలిపారు. దాంతో యూజీన్ ఆచూకీ తెలుసుకునేందుకు ఓర్జెక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆయన లాక్కవన్నాలోనే ఉంటున్నారని, అగ్నిమాపక శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయ్యారని తెలుసుకుంది.
ఆ తర్వాత యూజీన్ వద్దకు వెళ్లిన ఓర్జెక్ ఆ ఉంగరాన్ని ఆయనకు చూపించింది. దాన్ని చూసిన 80 ఏండ్ల యూజీన్ డార్మ్స్టెడ్టర్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆ ఉంగరాన్ని తాను 1958లో పోగొట్టుకున్నానని, ఎంత వెతికినా అది దొరకలేదని చెప్పారు. ఆరు దశాబ్దాల క్రితం పోగొట్టుకున్న ఆ ఉంగరాన్ని తిరిగి తీసుకొచ్చి తనకు ఇచ్చిన ఓర్జెక్ను మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రస్తుతం ఈ కథనం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. ఓర్జెక్ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.