లండన్, నవంబర్ 26: బ్రిటన్లో వలసదారుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. నిరుడు 1.73 లక్షలుగా ఉన్న ఈ సంఖ్య ఈ ఏడాది ఏకంగా 5 లక్షలు దాటింది. దీనిపై ఆందోళన చెందుతున్న రిషి సునాక్ ప్రభుత్వం.. వలసలను నియంత్రించేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నది. దీనిలో భాగంగా విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించడం సహా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలపై దృష్టి సారిస్తున్నట్టు బీబీసీ వార్తా సంస్థ వెల్లడించింది.
వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రధాని సునాక్ కట్టుబడి ఉన్నారని, ప్రాధాన్యం లేని డిగ్రీల కోసం, డిపెండెంట్ వీసాలతో వచ్చే విద్యార్థులపై ఆంక్షలు విధించేందుకు పరిశీలన చేస్తున్నట్టు డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే ఈ ఆంక్షలు ఏమిటి? అన్నదానిపై స్పష్టత లేదు. బ్రిటన్లోని అంతర్జాతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. దీంతో వలసలపై బ్రిటన్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే భారతీయులపైనే అధిక ప్రభావం పడే అవకాశం ఉన్నది.