Nobel Prize | స్టాక్హోం, అక్టోబర్ 5: నార్డిక్ దేశాల సాహిత్యంలో అద్భుతమైన నాటకాలు, నవలలు, చిన్న పిల్లల కథలు రాసిన ప్రముఖ రచయిత జాన్ ఫోసెను 2023 సాహిత్య నోబెల్ వరించింది. నార్వేకు చెందిన జాన్ ఫోసెను ఈ ఏడాది సాహిత్య నోబెల్కు ఎంపిక చేశామని ‘రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ లిటరేచర్ కమిటీ’ గురువారం ప్రకటించింది. ‘వినూత్న నాటకాలు, గద్య పద్య రచనలు చేశారు. మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు ఆయన తన రచనల ద్వారా స్వరాన్ని ఇచ్చారు. మానవ అభద్రత, చింత, ఆతృత, ఆందోళన మొదలైన వాటికి ప్రాధాన్యం ఇచ్చారు’ అని నోబెల్ లిటరేచర్ కమిటీ చైర్మెన్ అండర్స్ ఒల్సాన్ అన్నారు. ఆయన రాసిన 40 వరకు నాటకాలు, నవలలు, చిన్న పిల్లల కథలు డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్.. దేశాల్లో ఎంతగానో ఆదరణ చూరగొన్నాయి. ద నేమ్, డ్రీమ్ ఆఫ్ ఆటం, ఐయామ్ విండ్.. నాటక ప్రదర్శనలు యూరప్, అమెరికాలో చాలా పాపులర్.
నార్వేలో అధికార భాషగా గుర్తింపు అందుకున్న ‘బోక్మాల్’లో కాకుండా కేవలం 54 లక్షల మంది చదవగల, రాయగల ‘న్యోనోరస్క్’ భాషలో జాన్ ఫోసె రచనలు సాగటం గమనార్హం. ఆయనకు నోబెల్ సాహిత్యం దక్కటంపై గ్రామీణ నార్వే పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నది. 95ఏండ్ల తర్వాత నార్వే రచయితకు నోబెల్ ప్రైజ్ వచ్చిందని, న్యోనోరస్క్ భాషకు ఇది చరిత్రాత్మక రోజుగా నార్వే సాంస్కృతిక మంత్రి జాఫ్రే పేర్కొన్నారు. జాన్ ఒలావ్ ఫోసె 1959లో నార్వేలోని హేగ్సండ్ ప్రాంతంలో జన్మించారు. సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆయన లిటరేచర్లో పట్టా పొందారు. 1983లో ఆయన ‘రెడ్, బ్లాక్’ పేరుతో తొలి నవల రాశారు. ఆ తర్వాత అనేక నాటకాలు, చిన్న కథలు, కవిత్వాలు, చిన్నారుల పుస్తకాలు రచించారు.