22 రోజులు సముద్రంపై చావుతో ముగ్గురి యుద్ధం
న్యూఢిల్లీ, మే 16: నీళ్లు లేవు. అన్నం లేదు. చుట్టూ సముద్రం. పడవలో తను. తనతో పాటు మరో ఇద్దరు. 22 రోజుల క్రితం అదే పడవలో 59 మంది ఉన్నారు. అంతా వలసకూలీలు. మెరుగైన జీవితాన్ని వెతుక్కొంటూ బయల్దేరి సముద్రంలో చిక్కుకుపోయారు. పడవలో ఇంధనం అయిపోయింది. గాలి ఎటు తోస్తే అటు పోతున్నది. నీళ్లు లేక, తిండి లేక ఒక్కొక్కరే చనిపోతున్నారు. ఒక్కో మృతదేహాన్ని సముద్రంలో పడేస్తున్నారు. ఐవరీకోస్ట్కు చెందిన ఐకా(17), మరో ఇద్దరు మాత్రమే పడవలో ఇంకా ప్రాణాలతో ఉన్నారు. కానరీ ఐల్యాండ్స్ సమీపంలో సముద్రంలో తేలియాడుతున్న పడవను స్పెయిన్ ఎయిర్ఫోర్స్ గుర్తించింది. రక్షించింది. అలా ముగ్గురు 22 రోజులు మృత్యువుతో పోరాడి గెలిచారు.