మేఫీల్డ్, డిసెంబర్ 11: అమెరికాలో తీవ్రమైన పెనుగాలులు, టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. టోర్నడోల కారణంగా పలు రాష్ర్టాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. పెనుగాలుల విధ్వంసంతో అన్ని రాష్ర్టాల్లో కలిపి వందమందికి పైగా పౌరులు మృత్యువాత పడినట్టు సమాచారం. భారీ టోర్నడో కారణంగా కెంటకీ రాష్ట్రంలో ఓ క్యాండిల్ ఫ్యాక్టరీ పూర్తిగా కూలిపోయింది. టోర్నడో తాకిన సమయంలో ఫ్యాక్టరీలో 110 మంది దాకా కార్మికులు ఉన్నారని కెంటకీ గవర్నర్ ఆండీ బెషర్ చెప్పారు. ప్రమాదంలో 70-100 మంది దాకా చనిపోయి ఉంటారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ‘ఈ టోర్నడో కెంటకీ చరిత్రలోనే అత్యంత తీవ్రమైనది’ అని వ్యాఖ్యానించారు. పెనుగాలుల కారణంగా కెంటకీలోని పలు ప్రాంతాల్లో ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనల్లోనూ మరణాలు సంభవించినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించారు.
టెన్నెస్సీలో ఇద్దరు మృతి
టోర్నడోల కారణంగా ఇల్లినాయీలోని ఎడ్వర్డ్స్విల్లేలో ఉన్న అమెజాన్ గిడ్డంగి ధ్వంసం అయింది. లోపల వందలాది మంది చిక్కుకుపోయినట్టు స్థానిక మీడియా తెలిపింది. సహయ చర్యలు కొనసాగుతున్నాయి. మరణాలు, గాయపడినవారికి సంబంధించి స్పష్టత రాలేదు. గిడ్డంగి పైకప్పు మొత్తం కుప్పకూలి, గోడ పడిపోవడంతో ఆ ప్రాంతమంతా శిథిలంగా కనిపించింది. ఆర్కాన్సస్లో టోర్నడోలతో నర్సింగ్ హోం కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, అందులో చిక్కుకొన్న మరో 20 మందిని అధికారులు రక్షించారు. టెన్నెస్సీ రాష్ట్రంలో పెనుగాలులతో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మరణించారని అత్యవసర నిర్వహణ విభాగం అధికారులు తెలిపారు.
గతంలో చూడలేదు
టోర్నడోల బీభత్సంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇంతటి విపత్తును గతంలో చూడలేదన్నారు. నష్టపోయిన రాష్ర్టాలకు అవసరమైన సాయం చేస్తామన్నారు. నష్టాన్ని అంచనా వేస్తున్నామని తెలిపారు.