Mango Fruits | టోక్యో, మే 9: మన దగ్గర మామిడి పండ్లు మహా అయితే కిలో రూ.50 నుంచి ఎంత మేలిమిరకం పండైనా రూ.500కు మించదు. కానీ జపాన్లో ఓ రైతు పండించే మామిడి ధర వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. కేవలం ఒక్క పండు ఖరీదే రూ.19 వేలు. మామూలు మామిడి కంటే ఈ పండ్లు 15 శాతం తియ్యగా ఉంటాయని, వాటిని పండించే రైతు చెప్తున్నారు. జపాన్కు చెందిన హిరోయుకి నకగవా అనే రైతు 2011 నుంచి మామిడి సాగును చేప్టటాడు. వీటికి హకుగిన్ నో తాయో అనే బ్రాండ్ నేమ్ కూడా ఉంది.. దానర్థం.. మంచులో సూరీడు అని అట. ఎందుకంటే నకగవా వీటిని అతి శీతల ప్రాంతమైన హొక్కయిడో ద్వీపంలో ఓతోఫుకేలో గ్రీన్హౌస్లో సేంద్రీయ విధానంలో, ఎలాంటి రసాయనాలు వాడకుండా సాగు చేస్తున్నాడు.
ప్రపంచంలోనే అత్యధిక ధర పలికే మామిడిని నకగవా సాగు చేస్తున్నాడు. ఒక్కో హకుగిన్ పండు ధర 230 యుఎస్ డాలర్లు పలుకుతున్నది. నిజానికి ఇంత ఖరీదైన పండ్లను తాను పండిస్తానని కలలో కూడా అనుకోలేదంటున్నాడు నకగవా. మామిడి సాగుకు ముందు అతనికి పెట్రోల్ కంపెనీ ఉండేదట. ఆ వ్యాపారం నుంచి బయటపడి ఏదైనా కొత్తగా, సహజసిద్ధంగా చేయాలని నిర్ణయించుకున్నాడట. సీజన్కు కేవలం 5వేల పండ్లు మాత్రమే దిగుబడి అవుతాయి. హకుగిన్ నో తాయో రకం మామిడి పండ్లు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయని చెప్తున్నాడు. 2014లో నకగవా పండించిన ఒక్కొక్క మామిడి పండు రూ.33 వేలు పలికి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.