ISS | న్యూయార్క్, సెప్టెంబర్ 29: అంతరిక్షంలో రెండు దశాబ్దాలకు పైగా వ్యోమగాములకు సేవలందిస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)ను కూల్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రణాళికలు రచిస్తున్నది. 2031 నాటికి దీన్ని కూల్చివేయాలని ప్లాన్ చేస్తున్నది. ఐఎస్ఎస్ను సురక్షితంగా కూల్చేందుకు గానూ సుమారు రూ.8,300 కోట్లు (బిలియన్ డాలర్లు) వెచ్చించేందుకు నాసా సిద్ధమైంది. ఐఎస్ఎస్ను న్యూజిలాండ్, సౌత్ అమెరికా మధ్యలో ఉన్న పసిఫిక్ మహా సముద్ర జలాల్లోని శాటిలైట్ శ్మశానవాటికగా పిలిచే పాయింట్ నిమో వద్ద కూల్చివేయనున్నారు. గతంలో కాలం చెల్లిన మిర్ స్పేస్ స్టేషన్ను సైతం భూమిపై కూల్చివేశారు.
స్పేస్ టగ్ సాయంతో…
ఐఎస్ఎస్ కూల్చివేత ప్రక్రియ 2026లో ప్రారంభకానుంది. ఈ ప్రక్రియ 2031లో పూర్తవుతుంది. ఐఎస్ఎస్ను కూల్చేందుకు ఓ ప్రత్యేకమైన స్పేస్ వెహికిల్ను తయారు చేయాలని నాసా భావిస్తున్నది. యూఎస్ డీఆర్బిట్ వెహికిల్ (స్పేస్ టగ్)గా పిలుచుకునే దీన్ని తయారు చేసేందుకు ముందుకు రావాలని ప్రైవేటు కంపెనీలను నాసా ఆహ్వానించింది. అందుకోసం రూ. 8,300 కోట్లు చెల్లించేందుకు నాసా సిద్ధమైంది.
పాయింట్ నిమోలో కూల్చివేత…
భూమి ఉపరితలం నుంచి 250 మైళ్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్ను 175 మైళ్ల వరకు సాధారణంగానే తీసుకురావచ్చు. అయితే అక్కడి నుంచి దాన్ని భూ వాతావరణంలోకి తీసుకొచ్చేందుకు స్పేస్ టగ్ అవసరం అవుతుంది. దాని కక్ష్య నుంచి భూమి వైపునకు మళ్లించేందుకు ఈ స్పేస్ టగ్ దోహదపడుతుంది. 175 మైళ్ల నుంచి 75 మైళ్ల వరకు స్పేస్ టగ్ సాయంతో ఐఎస్ఎస్ను తీసుకొస్తారు. అక్కడి నుంచి అది భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. అనంతరం భూ వాతావరణం కారణంగా దాని భావ్య వలయం కొద్దికొద్దీగా కరిగిపోతుంది. ఆ తర్వాత గంటకు 18 వేల మైళ్ల వేగంతో నిర్దేశిత పాయింట్ నిమో వద్ద కూలిపోతుంది.
డీఅసెంబ్లీంగ్ చేయడం అసాధ్యం…
ఈ కూల్చివేత ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు 8 టన్నుల ప్రొపెల్లెంట్ ఇంధనం అవసరం అవుతుంది. సాధారణంగా రాకెట్ 30 నిమిషాల్లోనే 8 టన్నుల ఇంధనాన్ని వినియోగిస్తుంది. కానీ రాకెట్ సాయంతో దీన్ని భూమి పైకి తీసుకురావడం అసాధ్యం. రాకెట్కు స్పేస్ టగ్ కంటే తక్కువ సామర్థ్యం ఉండే ఇంజిన్లు ఉంటాయి. ఈ కారణంగా ఐఎస్ఎస్ పట్టుతప్పి భూమిపై జనావాసాల్లో పడే ప్రమాదం ఉంది.
మరోవైపు ఐఎస్ఎస్ను అంతరిక్షంలోనే డీఅసెంబ్లీంగ్ చేసి దాని విడిభాగాలను భూమిపైకి తీసుకురావాలని నాసా భావించినా.. భారీగా ఉండే ఐఎస్ఎస్ను డీఅసెంబ్లింగ్ చేయడం సాధ్యం కాదని ఈ ప్రయత్నాలను విరమించుకుంది. కక్ష్యను పెంచి అంతరిక్షంలోనే మరికొంత కాలం ఉంచాలని కూడా నాసా అనుకున్నది. అయితే దీని వల్ల ప్రమాదమేనని గ్రహించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది.
రెండు దశాబ్దాలకు పైగా సేవలు…
1984లో ఐఎస్ఎస్ను తయారు చేయాలని నాసా ప్రణాళికలు రచించింది. 1998లో దీని నిర్మాణం పూర్తయింది. 2000 నవంబర్ నుంచి ఐఎస్ఎస్ సేవలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటివరకు 20 దేశాలకు చెందిన 250 మందికి పైగా వ్యోమగాములు ఐఎస్ఎస్లో ఉంటూ అంతరిక్షంపై పరిశోధనలు చేశారు. ఐఎస్ఎస్ అనంతరం మరో స్పేస్ స్టేషన్ను రూపొందించేందుకు కూడా నాసా ప్రణాళికలు రచిస్తున్నది. దీన్ని తయారు చేసేందుకు నాసాతో పాటు వివిధ దేశాలు, పలు ప్రైవేటు కంపెనీలు పని చేస్తున్నాయి.