బ్యాంకాక్: ఒక మహిళ విషమిచ్చి 12 మంది స్నేహితులను హత్య చేసింది. హత్యకు గురైన వారిలో ఆమె ప్రియుడు కూడా ఉన్నాడు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. ఆ మహిళను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. థాయ్లాండ్లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 14న, 32 ఏళ్ల సరారత్ రంగసివుతాపోర్న అనే థాయ్లాండ్ మహిళ (Thailand Woman), తన స్నేహితురాలు సిరిపోర్న ఖాన్వాంగ్తో కలిసి పర్యాటక ప్రాంతానికి వెళ్లింది. అక్కడి నదిలో బౌద్ధ రక్షణకు సంబంధించిన పూజలను వారు నిర్వహించారు. అనంతరం ఆమె స్నేహితురాలు నది ఒడ్డున కుప్పకూలి మరణించింది. మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన పోలీసులు ఆమె శరీరంలో సైనైడ్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. విష ప్రయోగం వల్ల ఆ మహిళ చనిపోయినట్లు నిర్ధారించారు. అలాగే ఆమె మొబైల్ ఫోన్, డబ్బులు, బ్యాగ్ కూడా కనిపించకపోవడంతో ఆ మహిళ మరణంపై దర్యాప్తు జరిపారు.
కాగా, తన స్నేహితురాలికి సైనైడ్ ఇచ్చి సరారత్ హత్య చేసినట్లు దర్యాప్తులో పోలీసులకు తెలిసింది. దీంతో ప్రియుడితో సహా మరో 11 మందిని కూడా ఆమె ఇలాగే చంపినట్లు అనుమానిస్తున్నారు. 2020 డిసెంబర్ నుంచి 2023 ఏప్రిల్ మధ్య ఇలా చనిపోయిన ఆమె స్నేహితులంతా 33 నుంచి 44 ఏళ్ల వయస్కులని థాయ్లాండ్ పోలీస్ అధికారి తెలిపారు. వారంతా సైనైడ్ ప్రభావ లక్షణాలతోనే మరణించినట్లు చెప్పారు. మృతులకు సంబంధించిన బ్యాగ్లు, నగలు, డబ్బులు మాయమయ్యాయని వెల్లడించారు. వారి మరణాలపై కొందరు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయగా, సహజంగా చనిపోయినట్లు మరి కొందరు భావించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు.
మరోవైపు మాజీ పోలీస్ అధికారి భార్య అయిన సరారత్, కేవలం డబ్బు కోసమే 12 మంది స్నేహితులను చంపి ఉంటుందని థాయ్లాండ్ పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలకు సంబంధించిన ఆధారాలు లభిస్తే సీరియల్ కిల్లర్గా ఆమెకు ముద్ర పడుతుందని తెలిపారు. ఆ మహిళను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే నిందితురాలు గర్భవతి అని ఆమె తరుఫు న్యాయవాది తెలిపారు. కస్టడీలో పలు గంటలపాటు పోలీసులు ప్రశ్నించడంతో ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు చెప్పారు. ఆ మహిళపై వచ్చిన ఆరోపణలను ఆ లాయర్ ఖండించారు.