బ్యాంకాక్, మే 13: తమ వద్ద పొదుపు చేస్తే ఎన్నో రెట్లు అదనంగా సొమ్ములు ఇస్తామంటూ పోంజి స్కీంతో ఆన్లైన్లో మోసానికి పాల్పడిన దంపతులకు థాయిలాండ్ క్రిమినల్ కోర్టు ఒక్కొక్కరికి 12,640 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. వాంటనీ తిప్పావెత్, ఆమె భర్త మేతి చిన్ఫా పాంజీ 2019లో పోంజి మోసానికి తెరతీసారు. తమ వద్ద డబ్బు పొదుపు చేస్తే వాటిపై 96 శాతం రిటర్న్స్ ఇస్తామని, స్వల్ప కాలంలో మిలియనీర్లు కావాలంటే తమ పోంజి పథకంలో చేరాలంటూ Facebook, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఊదరగొట్టారు. ఈ సందర్భంగా వీరు కొన్ని నకిలీ వీడియోలను ఆన్లైన్లో ఉంచి ప్రలోభపెట్టేవారు. ఇలా వచ్చిన సొమ్ముతోనే తాను ఒక జ్యూయలరీ షాపును కూడా కొనుగోలు చేసానంటూ రకరకాల నగలు ధరిస్తూ వాంటనీ ఆ వీడియోలో చూపిస్తూ రెచ్చగొట్టేది.
వాస్తవానికి తన ఆఫీస్లోని రూమ్నే నగల షాపుగా భ్రమింపజేసేలా వారు నకిలీ వీడియోను తయారు చేశారు. దీంతో 2500 మందికి పైగా వారి పథకంలో పెట్టుబడి పెట్టారు. సుమారు 51.3 మిలియన్ డాలర్లు సేకరించి ఇద్దరూ బిచాణా ఎత్తేసారు. దీంతో వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. కోర్టు వీరికి 12,640 ఏండ్ల శిక్ష విధించింది. అయితే నిందితులు నేరాన్ని అంగీకరించడంతో దానిని 5,056 ఏండ్లకు తగ్గించారు. వాస్తవానికి వారికి అన్ని ఏండ్ల శిక్ష విధించినప్పటికీ థాయిలాండ్ చట్టాల ప్రకారం ఒక్కొక్కరు 20 ఏండ్ల పాటు మాత్రమే ఆ దేశం జైలులో ఉంటారని ఒక అధికారి తెలిపారు.