శాన్ ఆంటోనియో, జూన్ 28: అమెరికాలో మరో వలస విషాద ఘటన చోటుచేసుకున్నది. టెక్సాస్లో శాన్ ఆంటోనియాలోని ఒక రోడ్డుపై నిలిపివున్న ఓ కంటైనర్ ట్రక్కులో 46 మంది వలసదారులు మరణించి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అందులో ఉన్న నలుగురు చిన్నారులతో సహా మరో 16 మందిని చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానలకు తరలించారు. వీరిలో నలుగురు చికిత్స పొందు తూ మరణించారు. వీరంతా వలసదారులని, మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలోకి వస్తున్నట్టుగా అధికారులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో రోడ్డుపై నిలిపివున్న కంటైనర్ ట్రక్కు నుంచి సాయం కోసం ఆర్తనాదాలు విన్న స్థానికంగా పనిచేసే కార్మికుడు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు పరిశీలించగా ట్రక్కు డోరు కొద్దిగా తెరచి ఉన్నది. ఒకరి మృతదేహం ట్రక్కు కింద పడివుండటంతో పాటు ట్రక్కులో అనేక మంది అచేతనంగా ఉండటాన్ని గుర్తించారు. 46 మంది చనిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు.
మెక్సికో నుంచి వలసలు
ట్రక్కు మూసివున్న కారణంగా అందులోని అధిక ఉష్ణోగ్రత కారణంగా మరణాలు సంభవించినట్టు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దవాఖానలకు తరలించిన వారి శరీరం డీహైడ్రేట్ అయిందని అధికారులు తెలిపారు. ట్రక్కులోని ఏసీ యూనిట్ పనిచేయట్లేదని, నీటి సదుపాయం కూడా లేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధింది అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కొన్నేండ్లుగా మెక్సికో నుంచి అక్రమంగా అమెరికా సరిహద్దులు దాటే ప్రయత్నాల్లో వందలాది మంది మరణిస్తున్నారు. ఇదే శాన్ ఆంటోనియోలో 2017లో వాల్మార్ట్ మాల్ వద్ద పార్క్ చేసివున్న ట్రక్కులో 10 మంది వలసదారుల మృతదేహాలను గుర్తించారు.