US vs Iran : అగ్రరాజ్యం అమెరికా (USA) తో అణు చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ (Iran) కీలక వ్యాఖ్యలు చేసింది. యురేనియం శుద్ధిపై తాము వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేసింది. తమను ఎవరూ భయపెట్టలేరని, తాము ఎవరికీ భయపడేది లేదని అగ్రరాజ్యంపై కవ్వింపులకు పాల్పడింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బా అరాఘ్చి (Abbas Araghchi) ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా (USA) పై తమకు పెద్దగా నమ్మకం లేదని, యురేనియం శుద్ధిపై తామెందుకు వెనక్కి తగ్గాలని అరాఘ్చి అన్నారు. ఒకవేళ తమపై యుద్ధం ప్రకటించినా తాము దాన్ని వదిలేయబోమని చెప్పారు. తమను శాసించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ ప్రాంతంలో వారి (అమెరికా) సైనిక మోహరింపు తమను భయపెట్టలేదని చెప్పారు. అమెరికాతో చర్చల గురించి తమ వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలైన చైనా, రష్యాను కూడా సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు.
ఒమన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య ప్రస్తుతం పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. అణు కార్యక్రమంపై భవిష్యత్ సంప్రదింపులకు బాటలు వేసేందుకే ఇరు దేశాలు ఈ చర్చల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తమ సైనిక మోహరింపును పెంచుతోంది. అణు ప్రణాళికలకు సంబంధించి ఇరాన్పై ఒత్తిడి పెంచే ఉద్దేశంతోనే ఈ మోహరింపులు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఒకవేళ చర్చలు విఫలమైతే దాడులకు దిగుతామని ఈ సైనిక మోహరింపు ద్వారా అగ్రరాజ్యం సంకేతాలిచ్చింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారాయి.