Online games | బీజింగ్: ఆధునిక కాలంలో జూదానికంటే వేల రెట్లు ప్రమాదకరంగా ఆన్లైన్ గేమ్లు మనుషులను బానిసలుగా మారుస్తున్నాయి. ఆన్లైన్ ఆటలకు అలవాటపడ్డవారు ఎంతకైనా తెగిస్తారని చైనాలో జరిగిన ఘటన తెలియజేస్తోంది. ఎన్నో ఏండ్లుగా భవిష్యత్ అవసరాల కోసం తల్లి దాచిన ఖాతాలోని రూ.52 లక్షలను 13 ఏండ్ల బాలిక అపహరించి ఆన్లైన్ గేమ్లు ఆడి పోగొట్టుకుంది. ఆ దేశానికి చెందిన బాలిక ఆన్లైన్ గేమ్లకు బానిసగా మారింది.
నిత్యం ఫోన్లో పే-టు-ప్లే గేమ్స్ ఆడుతూ తల్లి బ్యాంక్ అకౌంట్లోని 449,500 యువాన్లు (భారత కరెన్సీలో 52.19 లక్షల రూపాయలు) కేవలం నాలుగు నెలల్లోనే పోగొట్టుకుంది. బాలిక ఎప్పుడూ ఫోన్లో గేమ్లు ఆడుతూ ఉండటాన్ని గమనించిన స్కూల్ టీచర్ ఆమె తల్లి వాంగ్కు విషయాన్ని తెలియజేసింది. ఎందుకో అనుమానం వచ్చి చూస్తే కూతురు తన బ్యాంక్లోని 52 లక్షల రూపాయలకు పైగా అపహరించి గేమ్లు ఆడినట్టు తెలిసి లబోదిబోమంది. ఇప్పుడు ఆమె అకౌంట్లో కేవలం 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మొబైల్ గేమ్ కంపెనీలకు చేసిన చెల్లింపులకు సంబంధించి పాస్బుక్లో నమోదైన ఎంట్రీలను చూపుతూ కూతురి నిర్వాకం గురించి ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఆ బాలిక తనకే కాక, తన స్నేహితులకు కూడా తల్లి ఖాతా నుంచే డబ్బులు చెల్లిస్తూ గేమ్లు ఆడటం శోచనీయం.