కరోనా వల్ల ప్రస్తుతం చాలా వరకు పనులన్నీ ఇంటి నుంచే చేస్తున్నారు. ముఖ్యంగా టీచింగ్ కోసం ఆన్లైన్ క్లాసులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇలా ఇంటి నుంచి క్లాసులు చెప్పేటప్పుడు పెంపుడు జంతువులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అది చూసి సరదాగా నవ్వుకోవాలే కానీ.. కోప్పడకూడదు. కానీ చైనాకు చెందిన ఒక ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ.. కోప్పడటమే కాదు, ఒక ఆర్ట్ టీచర్ను ఉద్యోగం నుంచి తీసేసింది. ఈ ఘటన గాంగ్ఝోలో జరిగింది.
ఒక ఎడ్టెక్ కంపెనీలో ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్న లువో అనే వ్యక్తి ఆన్లైన్ క్లాస్ చెప్తుండగా.. ఇంట్లోని పెంపుడు పిల్లి కెమెరా మీదకు దూకింది. ఇలా నాలుగైదు సార్లు జరిగింది. దీన్ని సీరియస్గా తీసుకున్న సదరు కంపెనీ.. లువోను ఉద్యోగం నుంచి తీసేసింది. ఈ నిర్ణయాన్ని ఆర్బిట్రేషన్లో సవాల్ చేయగా.. లువోకు నష్టపరిహారం చెల్లించాలని సదరు కంపెనీని కమిటీ ఆదేశించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఆ ఎడ్టెక్ కంపెనీ కోర్టుకెక్కింది.
లువో ప్రవర్తన ‘టీచర్ కోడ్ ఆఫ్ కండక్ట్’కు విరుద్ధంగా ఉందని, క్లాస్ టైంలో వేరే పనులు చేయకూడదని ఆ సంస్థ వాదించింది. ఈ వాదనను తోసిపుచ్చిన కోర్టు కూడా కమిటీ నిర్ణయాన్నే సమర్థించి.. లువోకు రూ.4.6 లక్షలు (40 వేల యువాన్లు) నష్టపరిహారం చెల్లించాలని తేల్చిచెప్పింది. కరోనా కష్టకాలంలో ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు ఇలాంటివి సహజమని, ఇంటిని ఆఫీసుతో పోల్చలేమని పేర్కొంది.