కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తమ యుద్ధం ముగిసిందని, అతి త్వరలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ( ISI ) ప్రకటించారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటులో తాలిబన్లు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సలహాలు, సూచనలు, సహకారం తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఐఎస్ఐ సూచనల ప్రకారమే తాలిబన్లు వ్యవహరిస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతున్నది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే విషయమై తాలిబన్ ప్రతినిధులు పాకిస్థాన్ ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్తో భేటీ అయ్యారు.
తాజాగా తమ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఐఎస్ఐ చీఫ్తో భేటీ అయినట్లు సాక్షాత్తూ తాలిబన్ ప్రతినిధులే ప్రకటించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను పరిపుష్టం చేసుకోడానికి ఈ చర్చలు జరిగాయని తెలిపారు. అయితే ప్రభుత్వంలోకి ఎవరెవరిని తీసుకోవాలన్న విషయంలో తాలిబన్లు ఇప్పటికే ఓ స్పష్టమైన వైఖరితో ఉన్నప్పటికీ ఈ విషయాన్ని కూడా ఐఎస్ఐ చీఫ్తో చర్చించినట్లు తెలుస్తున్నది.