కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని పంజ్షిర్ ప్రాంతంలో తాలిబన్ల( Taliban )కు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరుతో స్థానిక తిరుగుబాటుదారులు మంగళవారం రాత్రి తాలిబన్లతో తలపడ్డారు. పంజ్షిర్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాలు.. పర్వాన్ ప్రావిన్స్లోని జబల్ సరాజ్ జిల్లా.. బఘ్లాన్ ప్రావిన్స్లోని రెండు జిల్లాల్లో తాలిబన్లు, తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో మృతులపై ఇప్పటి వరకూ స్పష్టత లేకపోయినా.. తాము 350 మంది తాలిబన్లను హతమార్చామని, మరో 40 మందిని బందీలుగా చేసుకున్నామని నార్తర్న్ అలయెన్స్ వెల్లడించింది. అంతేకాదు ఇప్పుడు అమెరికాకు చెందిన వాహనాలు, ఆయుధాలు తమకు దక్కినట్లు ఖవాక్ కమాండర్ మునీబ్ అమీరి చెప్పాడు.
గుల్బహార్ నుంచి తమ పంజ్షిర్ లోయలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నించిన తాలిబన్లపై తిరుగుబాటుదారులు దాడి చేసినట్లు టోలో న్యూస్ వెల్లడించింది. మిమ్మల్ని లోయలోకి రానిస్తాము కానీ.. మళ్లీ బయటకు వెళ్లనీయమంటూ తాలిబన్లను ఉద్దేశించి నార్తర్న్ అలయెన్స్ ట్వీట్ చేసింది. మరోవైపు తాలిబన్ ప్రతినిధి మాత్రం పంజ్షిర్ మొత్తాన్ని సీజ్ చేసినట్లు చెప్పడం గమనార్హం. సోమవారం కూడా తాలిబన్లు పంజ్షిర్పై దాడి చేశారు. ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, స్థానిక తిరుగుబాటుదారుడు అహ్మద్ మసౌద్ నేతృత్వంలో తిరుగుబాటుదారులు తాలిబన్లను ప్రతిఘటిస్తున్నారు.