Afghanistan : ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్లోని కీలక స్థావరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేస్తోంది. నేరుగా ‘ఓపెన్ వార్’ అంటూ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ను ధీటుగా ఎదుర్కొనేందుకు ఆఫ్ఘనిస్తాన్ ఆత్మాహుతి దాడులకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా సూసైడ్ స్క్వాడ్ను ఆఫ్ఘన్ సిద్ధం చేసిందని స్థానిక మీడియా పేర్కొంది.
బెల్టు బాంబులు, కారు బాంబులతో తమ ఆత్మాహుతి దళం సిద్ధంగా ఉందని, పాక్లోని కీలక స్థావరాలపై దాడులు చేస్తామని వెల్లడించింది. తాలిబన్ల అగ్రనేత హమ్దుల్లా ఫిత్రాత్ మాట్లాడుతూ పాకిస్తాన్ సరిహద్దులోని దురంద్ లైన్ వద్ద పక్తియా, పక్తికా, ఖోస్ట్ ప్రాంతాల్లో తమ సైన్యం దాడులు చేస్తోందన్నారు. మరోవైపు పాకిస్తాన్ కీలక పట్టణాలైన ఇస్లామాబాద్, అబోటాబాద్, నౌషేరా, జమ్రుద్ ప్రాంతాలపై తమ వాయుదళం వైమానిక దాడులు చేసిందని ఆఫ్ఘనిస్తాన్ రక్షణశాఖ వెల్లడించింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో దాడులు చేసినట్లు తెలిపింది. ఉదయం తమ దేశంలోని కాబూల్, కాందహార్ వంటి పట్టణాలపై దాడులు చేసినందుకు ప్రతీకారంగా తాము కూడా పాకిస్తాన్లోని స్తావరాలపై దాడులు చేసినట్లు ఆఫ్ఘన్ రక్షణ శాఖ పేర్కొంది.
ఈ దాడులకు సంబంధించి 133 మంది ఆఫ్ఘన్ తాలిబన్లను అంతమొందించామని, 200 మందికిపైగా ఆఫ్ఘన్లు గాయపడ్డారని పాక్ పేర్కొంది. అయితే, తమ దాడుల్లో 55 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని, 19 సైనిక పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. ఇరువైపులా దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని సైనిక స్తావరాలతోపాటు సాధారణ ప్రజలపై కూడా పాక్ దాడులు చేస్తోంది. 22 ఆఫ్ఘన్ మిలిటరీ క్యాంపులపై పాక్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్తో చర్చలు జరపాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది.