కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు తమ వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. హెరాట్ నగరం ప్రధాన కూడలిలో శనివారం ఒక మృతదేహాన్ని క్రేన్కు వేలాడదీసి బహిరంగంగా ప్రదర్శించారు. మరో మూడు మృతదేహాలను ఇతర కూడళ్లలో వేలాడ దీశారు.
తాలిబన్ ఫైటర్లు నాలుగు మృతదేహాలను హెరాట్ నగర ప్రధాన కూడలికి తీసుకువచ్చారని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఒక మృతదేహాన్ని నగర ప్రధాన కూడలిలో క్రేన్కు వేలాడ దీయగా, మిగతా కూడళ్లలో బహిరంగంగా వేలాడ దీసేందుకు మూడు మృతదేహాలను తాలిబన్లు తరలించారని ప్రత్యక్షంగా చూసిన ఫార్మసీ యజమాని వజీర్ అహ్మద్ సిద్దిఖీ తెలిపినట్లు పేర్కొంది.
కాగా, కిడ్నాప్కు యత్నించిన నలుగురిని పోలీసులు పట్టుకుని చంపారని, ఒక మృతదేహాన్ని క్రేన్కు వేలాడదీసిన అనంతరం తాలిబన్ అధికారి ప్రకటించినట్లు ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.
మరోవైపు తమ మునుపటి పాలనలో మాదిరిగా షరియా చట్టం ప్రకారం కఠిన శిక్షలు అమలు చేస్తామని, చేతులు నరకడంతోపాటు బహిరంగంగా ఉరి తీస్తామని తాలిబన్ నేత ముల్లా నూరుద్దీన్ తురాబి ఇటీవల తెలిపాడు. గతంలో తాలిబన్ విధించిన దారుణ శిక్షల అమలుకు అతడు బాధ్యత వహించాడు.