కాబుల్: ఆఫ్ఘనిస్థాన్లోని 85 శాతం భూభాగం తమ నియంత్రణలో ఉన్నదని తాలిబాన్ ప్రకటించింది. అమెరికా సైనిక బలగాలు వెనుదిరిగిన తర్వాత సరిహద్దు పట్టణం ఇస్లాం ఖాలాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. దీంతో ఇరాన్ సరిహద్దు నుండి చైనా సరిహద్దు వరకు ఉన్న భూభాగం పూర్తిగా తమ ఆధీనంలో ఉన్నట్లు తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. కాగా, ఆఫ్ఘనిస్థాన్లోని 398 జిల్లాల్లో 250 జిల్లాలు తమ నియంత్రణలో ఉన్నాయని మాస్కోలోని తాలిబాన్ ప్రతినిధులు వెల్లడించారు.
మరోవైపు తాలిబాన్ స్వాధీనం చేసుకున్న ఇస్లాం ఖాలా ప్రాంతంలో సైనిక బలగాలు పోరాడుతున్నాయని కాబూల్లోని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ వెల్లడించారు. కాగా, పరిస్థితిని ప్రభుత్వం చక్కదిద్దుతుందని అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఇటీవల అన్నారు. అయితే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అంగీకరించారు. మరోవైపు తాలిబాన్ దాడులను తట్టుకోలేక సుమారు వెయ్యి మంది ఆఫ్ఘన్ సైనికులు ఇటీవల తజికిస్థాన్లోకి పారిపోయారు.