కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను మరోసారి తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు మహిళలపై వివక్షను కొనసాగిస్తున్నారు. వారి హక్కులను హరిస్తున్నారు. తాజాగా మహిళా మంత్రిత్వ శాఖలో పని చేసే నలుగురు మహిళా ఉద్యోగులను కాబూల్లోని ఆ శాఖ కార్యాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. కేవలం పురుష ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ దేశ మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన మహిళా ఉద్యోగులపై తాలిబన్లు నిషేధం విధించినట్లు ఆ శాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు. మరోవైపు ఈ చర్యను నిరసిస్తూ మహిళా ఉద్యోగులు మహిళా మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు.
20 ఏండ్ల తర్వాత ఆఫ్ఘనిస్థాన్ను స్వాధీనం చేసుకున్న తాలిబన్ల గత పాలనపై ఆ దేశ మహిళలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్ట్రాకాన్సర్వేటివ్ ఇస్లామిక్ పాలనలో మహిళలపై రాళ్లు రువ్వడం, విచ్ఛేదనం, బహిరంగ ఉరిశిక్షలు, తుపాకీతో కాల్చివేయడం వంటి దారుణాలను గుర్తు చేసుకుని ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. తమ హక్కుల కోసం కొందరు మహిళలు ఇటీవల నిరసన తెలుపగా తాలిబన్లు వారిని కొరడాలు, లాఠీలతో దారుణంగా కొట్టారు.