కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )ను మరోసారి తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తాలిబన్లు శాంతి వచనాలు వల్లించారు. మహిళల హక్కులను గౌరవిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లోకి కూడా వాళ్లను ఆహ్వానిస్తామని ప్రకటించారు. కానీ కాబూల్లో పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఎలాగైనా దేశం వదిలి వెళ్లడానికి కాబూల్ ఎయిర్పోర్ట్కు వస్తున్న మహిళలు, పిల్లలపై తాలిబన్లు దారుణంగా దాడికి పాల్పడుతున్న ఫొటోలు, వీడియోలు భయానకంగా ఉన్నాయి. పదునైన ఆయుధాలతో వారిపై దాడి చేస్తున్నారు. అంతేకాదు వారిపై ఫైరింగ్ కూడా జరుపుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను లాస్ ఏంజిల్స్ టైమ్స్ రిపోర్టర్ మార్కస్ యామ్ పోస్ట్ చేశారు. తాలిబన్ల దాడిలో పలువురు గాయపడినట్లు ఆయన చెప్పారు.
మాజీ ప్రభుత్వ ఉద్యోగులను వెతుకుతూ.. కాబూల్ వీధుల్లో తుపాకులతో స్వేచ్ఛగా తిరుగుతున్న తాలిబన్లు కాల్పులు జరుపుతున్నారు. ఇక తఖార్ ప్రావిన్స్లో ఓ మహిళ బుర్కా లేకుండా బయటకు వచ్చిందని కాల్చి చంపారు. ఆగస్ట్ 1 నుంచే ఆఫ్ఘనిస్థాన్లో వెయ్యి మందికిపైగా పౌరుల తాలిబన్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్య రాజ్య సమితి వెల్లడించింది.