కాబుల్: అమెరికా, నాటో దళాలు ఉపసంహరణ మొదలైన తర్వాత ఆఫ్ఘనిస్థాన్లో మళ్లీ తాలిబన్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ వార్నింగ్ ప్రకటన జారీ చేశారు. 15 ఏళ్లు దాటిన అమ్మాయిల జాబితాతో పాటు 45 ఏళ్ల లోపు ఉన్న వితంతువుల వివరాలు ఇవ్వాలని స్థానిక మతపెద్దలకు అల్టిమేటం ఇచ్చారు. తమ ఫైటర్లు ఆ ఆడవాళ్లను పెళ్లి చేసుకోనున్నట్లు తాలిబన్ తన ప్రకటనలో తెలిపింది. పెళ్లి చేసుకున్న తర్వాత వారిని పాకిస్థాన్లోని వజరిస్తాన్కు తీసుకువెళ్లి.. అక్కడ ఇస్లాం మతంలోకి మార్చనున్నట్లు తాలిబన్ పేర్కొన్నది. ఎక్కడెఎక్కడైతే తాలిబన్లు ఆయా ప్రాంతాలను ఆక్రమించారో.. అక్కడ ఉన్న ఇమామ్లు, ముల్లాలకు తమ సందేశాన్ని వాళ్లు పంపారు. తాలిబన్ కల్చరల్ కమిషన్ పేరుతో రిలీజ్ చేసిన లేఖలో ఈ హుకుం జారీ చేశారు.
ఇరాన్, పాకిస్థాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ దేశ సరిహద్దులతో ఉన్న బోర్డర్ పోస్టు జిల్లాలను తాలిబన్లు మళ్లీ స్వాధీనంలోకి తీసుకున్నారు. తాలిబన్ ఉగ్రవాదులు తమ ఇండ్లల్లో ఉన్న ఆడవాళ్లను తీసుకువచ్చి, వారిని పెళ్లి చేసుకుని, బానిసలుగా మార్చుతారని ఆఫ్ఘన్లోని వృద్ధ నేతలు ఆరోపిస్తున్నారు. తాలిబన్లు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు డిప్రెషన్లోకి వెళ్తున్నారని హజీ రోజీ బెయిగ్ అనే నేత తెలిపారు. ఇక గట్టిగా మాట్లాడలేం, పాటలు వినలేం, మార్కెట్కు ఆడవాళ్లను పంపలేమని, తాలిబన్ కమాండర్లు 18 ఏళ్లు దాటిన ఆడవాళ్ల వివరాలను సేకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తమ కూతుళ్లు అక్రమంగా లాక్కెళ్లి పెళ్లి చేసుకుంటారని ఆయన భయాన్ని వ్యక్తం చేశారు.