కాబూల్: గ్వాంటెనామో జైలు.. ప్రపంచంలోనే అత్యంత కరడుగట్టిన నేరగాళ్లు, అంతర్జాతీయ ఉగ్రవాదులను బంధీలుగా ఉంచిన స్థలం. అలాంటి జైలులో శిక్ష అనుభవించిన ఓ ఉగ్రవాది ఆఫ్ఘన్ రక్షణ మంత్రి అయ్యాడు. అవును.. ఆఫ్ఘనిస్థాన్ను ఆక్రమించిన తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుదిశగా ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగా దేశ తాత్కాలిక రక్షణ శాఖ మంత్రిగా గ్వాంటెనామో జైలు మాజీ ఖైదీ ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ జకీర్ను నియమించింది.
తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ సన్నిహితుడు, ఉగ్రవాద సంస్థ వెటరన్ కమాండర్ అయిన జకీర్ను రక్షణమంత్రిగా నియమించినట్లు తాలిబన్ వర్గాలు వెల్లడించాయని ప్రముఖ న్యూస్చానల్ అల్ జజీరా పేర్కొన్నది. జకీర్ను 2001లో అమెరికా బలగాలు జకీర్ను బంధించాయి. అప్పటి నుంచి 2007 వరకు గ్వాంటెనామో జైలులో ఖైదీగా ఉన్నాడు. అనంతరం అమెరికా బలగాలు అతడిని ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అప్పగించాయి.
ఆఫ్ఘన్ ఆక్రమించిన తాలిబన్లు దేశంలో ఇప్పటికే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాలిబన్ అగ్రనేతలను అత్యున్నత హోదాల్లో నియమించింది. సెంట్రల్ బ్యాంక్ అయిన ద ఆఫ్ఘనిస్థాన్ బ్యాంక్ (డీఏబీ) తాత్కాలిక అధినేతగా హాజీ మహమ్మద్ ఇద్రిస్ ఇప్పటికే బాధ్యతలు చేపట్టారు.