Taiwan : తైవాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తప్పనిసరిగా సైన్యంలో పని చేయాలనే నిబంధనను మరో ఏడాది పాటు పొడిగించింది. ఇప్పటి వరకు నాలుగు నెలలు ఉన్న తప్పనిసరి తప్పనిసరి మిలటరీ సర్వీస్ను అమాంతం ఏడాది కాలానికి పెంచింది. 2024 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. చైనా నుంచి ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో తైవాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తైవాన్ అధ్యక్షురాలు థ్యాయ్ ఇంగ్ వెన్ మంగళవారం వెల్లడించారు. తైవాన్ శాంతిని కోరుకుంటుందని, తమ దేశంపై చైనా దాడిని తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా థ్యాయ్ తెలిపారు. ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు. కానీ మా పొరుగు దేశం చైనా యుద్ధాన్ని కోరుకుంటోంది. అందుకనే 2024 నుంచి మిలిటరీ సర్వీస్ను ఏడాదికి పెంచుతున్నాం. 2005 జనవరి 1 తర్వాత జన్మించిన అందరు మగవాళ్లకు ఈ నిబంధన వర్తిస్తుంది అని ఆమె వెల్లడించారు.
సైనిక విన్యాసాలతో కవ్వింపు చర్యలకు పాల్పడడమే కాకుండా దౌత్యపరంగా, ఆర్థికంగా తైవాన్ మీద చైనా ఒత్తిడి పెంచుతోంది. తైవాన్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయాలనే పన్నాగం పన్నుతోంది. చాలా రోజులుగా చైనా, తైవాన్ను తమ భూభాగంలో ఒకటిగా పేర్కొంటోంది. జిన్పింగ్ అధ్యక్షుడు అయ్యాక తైవాన్ను ఆక్రమించుకునే దిశగా చైనా చర్యలు మొదలుపెట్టింది. అవసరమైతే సైనిక చర్య ద్వారా అయిన ఆ దేశాన్ని తమ భూభాగంలో కలిపేసుకోవాలనే ఉద్దేశంతో ఉంది.