ఉక్రెయిన్పై పోరుకు త్వరలో రంగంలోకి..
లీవ్పై రష్యా క్షిపణిల వర్షం.. ఏడుగురు మృతి
కీవ్, ఏప్రిల్ 18: యుద్ధం మొదలై రెండు నెలలు సమీపిస్తున్నప్పటికీ ఉక్రెయిన్ను ఆక్రమించాలన్న రష్యా కాంక్ష నెరవేరడంలేదు. దీంతో అధ్యక్షుడు పుతిన్ కొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రష్యా తరఫున త్వరలో సిరియా ఫైటర్లను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉక్రెయిన్లో సైనిక చర్యలను పర్యవేక్షిస్తున్న జనరల్ అలెగ్జాండర్ డివోర్నికోవ్ వెనుకుండి ఈ వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు సమాచారం. సిరియా యుద్ధంలో రష్యా మిలిటరీకి ఈయనే కమాండర్గా వ్యవహరించడం తెలిసిందే. అన్నీకుదిరితే వచ్చే దశ యుద్ధంలో సిరియా ఫైటర్లు రష్యాకు తోడుగా ఉక్రెయిన్పై పోరుకు దిగొచ్చని సమాచారం. మరోవైపు, లీవ్పై రష్యా జరిపిన క్షిపణిల దాడిలో ఏడుగురు మృతిచెందారు. కీవ్లోని ఓ ఆయుధ కర్మాగారాన్ని ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించింది.
ఆయుధాలు ఇచ్చి సాయం చేయండి
రష్యా అరాచకాలపై స్పందించాలని, ఆయుధాలు ఇచ్చి సాయం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. రష్యా అణుదాడి చేసే ప్రమాదమున్న నేపథ్యంలో యాంటీ రేడియేషన్ మాత్రలు ఇవ్వాలని కోరారు. మరియుపోల్ను అప్పగించబోమని, ఆ నగరంలో తమ సైన్యం ఇంకా పోరాడుతున్నదని వెల్లడించారు. ‘స్థానిక ప్రభుత్వ ప్రతినిధులను కిడ్నాప్ చేస్తున్నారు. పౌరులను హింసిస్తున్నారు. అయినా మేం లొంగిపోకుండా పోరాడుతున్నాం’ అని పేర్కొన్నారు. పోరాటం విషయంలో తమమీద తమకు తప్ప, ఈ ప్రపంచం మీద నమ్మకం లేదని ఆయన వ్యాఖ్యానించారు.