సిడ్నీ: ఆస్ట్రేలియాలో కరోనా ఉదృతి తగ్గడం లేదు. దీంతో సిడ్నీ ( Sydney Lockdown ) లో మరో నెల రోజుల పాటు లాక్డౌన్ పొడిగించారు. ఆ నగరంలో గత రెండు నెలల నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం నుంచి పాక్షికంగా కర్ఫ్యూ విధించనున్నారు. వేగంగా విస్తరిస్తున్న కరోనాను సిడ్నీ నియంత్రించలేకపోయింది. నగరంలో 50 లక్షల మంది జనాభా ఉన్నారని, వారిని రక్షించేందుకు ఈ చర్యలు తప్పవని న్యూ సౌత్ వేల్స్ నేత గ్లాడిస్ బెర్జిక్లియన్ తెలిపారు. దురదృష్టవశాత్తు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్లు ఆమె వెల్లడించారు. సెప్టెంబర్ చివర వరకు ఇలాంటి పరిస్థితే ఉండే అవకాశాలు ఉన్నట్లు ఆమె చెప్పారు. సిడ్నీలో ఇటీవల రోజుకు 600కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సెప్టెంబర్ చివర వరకు స్టే ఎట్ హోమ్ ఆదేశాలు అమలులో ఉంటాయన్నారు. హాట్స్పాట్ ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ ఉంటుంది. నగరంలో వెయ్యి మంది బలగాలను మోరించారు. సిడ్నీలో 30 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.