స్టాక్హోమ్, అక్టోబర్ 3: మానవ శరీరంలో వేల ఏండ్లుగా కొనసాగుతున్న జన్యువుల ప్రవాహాన్ని తెలియజెప్పిన స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటె పాబోకు అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం దక్కింది. వైద్యశాస్త్ర విభాగంలో భాగంగా ఆయనకు ఈ అవార్డు అందజేస్తున్నట్టు స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృందం సోమవారం ప్రకటించింది. పాబో మానవ పరిణామ క్రమాన్ని విశదీకరించటంతో నూతన విషయాలను తెలుసుకోగలిగామని వెల్లడించింది. అంతరించిపోయిన నియాండెర్తల్ జన్యువును సీక్వెన్స్ చేసి, హొమినిన్ డెనిసోవాపై పాబో కీలక ఆవిష్కరణ చేశారు. 70 వేల ఏండ్లకు పూర్వం ఆఫ్రికా నుంచి వలస వచ్చి, ఆ తర్వాత అంతరించిపోయిన హొమినిన్ల నుంచి హోమోసెపియన్లకు జన్యు బదిలీ జరిగిందని ఈయన గుర్తించారు. ప్రస్తుత మానవుల్లోనూ నాటి జన్యువుల ప్రవాహం కొనసాగుతున్నదని స్పష్టం చేశారు. ఇది రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నదని వివరించారు. ఈయ న పరిశోధనలు ఎన్నో ఆవిష్కరణలకు దారితీసిందని నోబెల్ బృందం కొనియాడింది.
పాబో తండ్రికి కూడా..
స్వాంటె పాబో స్టాక్హోమ్లో జన్మించారు. ఆయన తల్లి ఎస్టోనియాకు చెందిన కెమిస్ట్ కరిన్ పాబో. తండ్రి స్వీడన్కు చెందిన బయోకెమిస్ట్ కార్ల్ సనే బెర్గ్స్ట్రోమ్. ఈయన కూడా 1982లో వైద్య రంగంలోనే నోబెల్ అందుకోవడం విశేషం. మరో ఇద్దరితో కలిసి ఆయనీ పురస్కారం అందుకున్నారు.