Pak drone | సరిహద్దులో పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్ జారవిడిచిన మూట ఒకటి కలకలం సృష్టించింది. అనుమానాస్పదంగా కనిపించడంతో జమ్ముకశ్మీర్ పోలీసులు.. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ను పిలిపించి తనిఖీ చేయించారు. ఈ మూటలో నగదు, తుపాకులు, బుల్లెట్లు లభించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
జమ్ములోని సాంబా జిల్లాలో గురువారం ఉదయం విజయ్పూర్లోని సవంకా మలుపు నుంచి కొంత దూరంలో సీల్డ్ ప్యాకెట్ ఒకటి పోలీసులకు లభించింది. పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్లు ఈ మూటను పడేసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ ప్యాకెట్ అనుమానాస్పదంగా ఉండటంతో బాంబు నిర్వీర్యం దళాలను రంగంలోకి దించి తనిఖీ చేయించారు. ఈ మూటను విప్పిచూడగా పలు రూ.5 లక్షల నగదు, 2 చైనీస్ పిస్టల్స్, 4 మ్యాగజైన్లు, స్టీల్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) లభ్యమయ్యాయి.
ఏదో ఒక కుట్ర చేసేందుకే ఈ పేలుడు పదార్థాలను మన దేశంలోకి చేరవేసినట్లు సాంబా ఎస్ఎస్పీ అభిషేక్ మహాజన్ అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో డ్రోన్లతో ఆయుధాలు, మందుగుండు సరఫరా ఎక్కువైందని, పోలీసులు సరిహద్దు గ్రామాల్లో పహారా కాస్తు డ్రోన్లు కనిపించగానే కూల్చేస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేయడం పట్ల సాంబా పోలీసులు హర్షం వ్యక్తం చేశారు.