ఖాట్మండు: ఫ్రాన్స్కు చెందిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదలకు నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా జైలు నుంచి విడుదలైన 15 రోజుల లోపలే అతడిని దేశం నుంచి పంపించేయాలని కూడా నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. చార్లెస్ శోభరాజ్ ఇద్దరు అమెరికా టూరిస్టులను హత్య చేసిన కేసులో 2003లో నేపాల్లో అరెస్టయ్యాడు.
నేపాల్ సుప్రీంకోర్టు అతనికి జీవితఖైదు విధించింది. దాదాపు 20 ఏండ్లుగా జైలుశిక్ష అనుభవిస్తుండటం, వృద్ధాప్యం దరిచేరడం లాంటి కారణాలతో చార్లెస్ శోభరాజ్ విడుదలకు ఆదేశిస్తున్నట్టు నేపాల్ సుప్రీంకోర్టు పేర్కొన్నది. అంతకు ముందు 1976 నుంచి 1997 వరకు భారత జైళ్లలో చార్లెస్ శోభరాజ్ శిక్ష అనుభవించాడు.
చార్లెస్ శోభరాజ్ భారత పౌరుడికి, వియత్నాం పౌరురాలికి జన్మించాడు. అతడి చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత తల్లి రెండో భర్త శోభరాజ్ను దత్తత తీసుకున్నాడు. కానీ, వారికి పిల్లలు కలిగిన తర్వాత శోభరాజ్ను నిర్లక్ష్యం చేశారు. దాంతో అతడు నేరాల బాటపట్టాడు. ఆ తర్వాత ఆగ్నేయాసియా దేశాల్లో వరుస హత్యలు, దోపిడీలు, మోసాలతో చెలరేగిపోయాడు. దాంతో అప్పట్లో ప్రపంచ దేశాల్లో అతని పేరు మారుమోగింది.