వాషింగ్టన్, ఆగస్టు 23: భూమిపై జీవం ఆవిర్భవించడానికి కారణమైన సూర్యుడు.. గ్రహాలు ఒకదానికొకటి ఢీకొనకుండా క్రమపద్ధతిలో పరిభ్రమణం చేయడానికి కూడా సాయపడుతున్నాడు. అయితే బుధుడు, శుక్రుడితో పాటు భూమిని కూడా తనలో కలుపుకొని భస్మీపటలం చేసే దిశగా సూర్యుడి ప్రయాణం కొనసాగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తాజాగా తెలిపారు.
కబళించడానికి కారణం ఏమిటి?
విశ్వాంతరాళంలోకి సూర్యుడు నిరంతరం శక్తిని విడుదల చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. కేంద్రకంలోని హైడ్రోజన్, హీలియం వంటి పరమాణువుల సంలీన చర్యల కారణంగా సూర్యుడు ఈ ఉష్ణాన్ని విడుదల చేస్తున్నాడు. అయితే, రానున్న కాలంలో హైడ్రోజన్ కొరత కారణంగా సూర్యుడు రెడ్ జెయింట్గా (మృత నక్షత్రంగా మారడానికి ముందు దశ) మారుతాడని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో సూర్యుడి బయటి పొర వందలరెట్లు పరిధిలో విస్తరిస్తుందని చెబుతున్నారు. దీని వల్లే సూర్యుడికి దగ్గరగా ఉన్న బుధుడు, శుక్రుడు, భూమిపై ప్రభావం పడి ఆయా గ్రహాలు మండిపోవచ్చని అంటున్నారు.
ఎప్పుడు కబళించవచ్చు?
రానున్న 500 కోట్ల ఏండ్లలో బుధుడు, శుక్రుడు, భూమిని.. సూర్యుడు తనలో కలుపుకోవచ్చని అంచనా. కాగా సూర్యుడు తన జీవితకాలంలో మధ్య స్థితికి వచ్చాడని, ఇప్పుడు ఆ నక్షత్రం వయసు 457 కోట్ల ఏండ్లు ఉండవచ్చని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇటీవల వెల్లడించడం తెలిసిందే.