Solar Power | లండన్, నవంబర్ 11: సౌర విద్యుత్తు ఉత్పత్తిలో సరికొత్త ముందడుగు పడనుంది. ఇప్పటివరకు భూమిపైన సౌరఫలకలను ఏర్పాటు చేసి సూర్య కిరణాలను గ్రహించి, విద్యుత్తు ఉత్పత్తి చేసేవారు. ఇక మీదట అంతరిక్షం నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ దిశగా యూకేకు చెందిన స్పేస్ సోలార్ అనే అంకుర సంస్థ, ఐస్లాండ్ దేశానికి చెందిన విద్యుత్తు ఉత్పత్తి సంస్థ రేక్జావిక్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
2030 నాటికి 30 మెగావాట్ల అంతరిక్ష ఆధారిత సౌర విద్యుత్తు కేంద్రాన్ని ప్రారంభించాలనేది ఈ ఒప్పంద లక్ష్యం. సౌర విద్యుత్తు స్వచ్ఛమైనదే, పర్యావరణహితమైనదే అయినప్పటికీ ఉత్పత్తిలో పలు సమస్యలు ఉంటాయి. వాతావరణం ప్రతికూలంగా ఉండి, మేఘాలు ఏర్పడినప్పుడు సౌర విద్యుత్తు ఉత్పత్తి కాదు. ఈ సమస్యకు పరిష్కారంగా అంతరిక్ష ఆధారిత సౌర విద్యుత్తు కేంద్రాలను నిర్మించాలనే ప్రతిపాదన 1970ల నుంచి ఉంది.
ఇంతకాలంగా ఆచరణసాధ్యం కాదని భావిస్తున్న ఈ ప్రయత్నానికి ఇప్పుడు స్పేస్ సోలార్, రేక్జావిక్ ఎనర్జీ ముందడుగు వేస్తున్నాయి. భూమికి 35,786 కిలోమీటర్ల దూరంలో జియోసింక్రోనస్ కక్ష్యలో ముందుగా ఫోటోవాల్టాయిక్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటుచేస్తారు. గాలి, మేఘాలు, ధూళి వంటి ఆటంకాలు లేకుండా నేరుగా ఇవి సూర్య కిరణాలను గ్రహించి విద్యుత్తుగా మారుస్తాయి. విద్యుత్తును సూక్ష్మ తరంగాలుగా మార్చి భూమి మీదకు పంపిస్తాయి. భూమి మీద ఏర్పాటు చేసి రిసీవర్లు ఈ సూక్ష్మ తరంగాలను మళ్లీ విద్యుత్తుగా మార్చి గ్రిడ్లకు పంపిస్తాయి.