కొలంబో : ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక మంగళవారం సంచలన ప్రకటన చేసింది. దేశ ఖజానా దివాలా తీసిందని వెల్లడించింది. 51 బిలియన్ డాలర్ల అప్పును తీర్చలేమని లంక ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ రుణాలు చెల్లించలేమని చేతులెత్తేసింది. మరోవైపు శ్రీలంకలో ఆందోళనలు ఉధృతమయ్యాయి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలమంది లంకేయులు రోడ్డెక్కారు. లంకేయుల ఆందోళనకు బౌద్ధగురువులు మద్దతు తెలిపారు. గత కొద్దిరోజులుగా సాగుతున్న నిరసనలు ఉధృతమయ్యాయి. ఇక దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్స అన్నారు.
కొవిడ్-19 లాక్డౌన్ కారణంగా విదేశీ మారక నిల్వలు మరింత దిగజారాయని చెప్పారు.ప్రజలు నిరసనలు విరమించి రోడ్లపై నుంచి వెనక్కి మరలాలని కోరారు. వీధుల్లో నిరసనలతో నగద కొరతను ఎదుర్కొంటున్న మన దేశానికి ఆర్ధిక సాయం అందడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధిక సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమని విపక్ష నేత సాజిత్ ప్రేమదాస ఆరోపణలను రాజపక్స తోసిపుచ్చారు.