కొలంబో: శ్రీలంకను వీడి మాల్దీవులు చేరిన అధ్యక్షుడు గొటబయ రాజపక్సేకు అక్కడ కూడా నిరసన సెగ ఎదురైంది. ఆ దేశంలోని శ్రీలంక వాసులు బుధవారం పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ‘గొటబయ గో’ అంటూ నినాదాలు చేశారు. దీంతో తొలుత దుబాయ్కు వెళ్లాలని భావించిన రాజపక్సే చివరకు మాల్దీవులను వీడి సింగపూర్కు వెళ్లినట్లుగా తెలుస్తున్నది. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ ప్రజల ఆందోళనలను ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 9న అధ్యక్ష భవనంలోకి చొచ్చుకెళ్లారు. దీంతో రాజపక్సే తన అధికార నివాసం నుంచి పారిపోయారు. అయితే ఆయన దేశం విడిచి పరారైనట్లుగా ఊహాగానాలు వెలువడ్డాయి.
కాగా, తన పదవికి బుధవారం రాజీనామా చేస్తానని చెప్పిన అధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఈ తెల్లవారుజామున శ్రీలంకను వీడారు. భార్య, ఇద్దరు బాడీ గార్డులతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు చేరారు. ఆ దేశ స్పీకర్ మహ్మద్ నషీద్ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అయితే అధ్యక్ష పదవికి రాజీనామా చేయని రాజపక్సే, మాల్దీవులు చేరుకున్న సంగతి తెలిసి అక్కడున్న శ్రీలంక వాసులు బుధవారం పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో రాజపక్సే మాల్దీవులను వీడి సింగపూర్ చేరుకున్నట్లుగా తెలుస్తున్నది.
మరోవైపు అధ్యక్షుడు రాజపక్సే దేశం వీడిపోవడంతో ఆయన అనుచరుడైన ప్రధాని రణిల్ విక్రమసింఘే, తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. శ్రీలంక వాసులు దీనిపై మరింతగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులు బుధవారం ప్రధానమంత్రి కార్యాలయంలోకి పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. ‘రణిల్ గో’ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు మిలిటరీ, పోలీసులు ఏదైనా చేయాలంటూ రణిల్ ఆదేశించారు. ‘యాక్టింగ్ ప్రెసిడెంట్గా నా బాధ్యతలను నిర్వర్తించకుండా నన్ను ఆపాలని వారు కోరుకుంటున్నారు. ఫాసిస్టులు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి మేం అనుమతించం’ అని అన్నారు.
కాగా, రణిల్ విక్రమసింఘే ఆదేశాలతో శ్రీలంకలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కనిపిస్తే కాల్చి వేయాలన్న ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీలంక డిఫెన్స్ చీఫ్ జనరల్ శవేంద్ర సిల్వా మీడియాతో మాట్లాడారు. సాయుధ బలగాలు, పోలీసులు దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తారని తెలిపారు. అధ్యక్షుడు గొటబయ మాల్దీవులకు పారిపోయిన నేపథ్యంలో దేశ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు ముందుకు వెళ్లే మార్గాన్ని నిర్ణయించి సాయంత్రంలోగా తమకు, ప్రజలకు తెలియజేయాలని రాజకీయ నాయకులను ఆయన కోరారు. దీంతో స్పీకర్ మహింద యాపా అబేవర్దన పార్లమెంట్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.