మాలె/కొలంబో, జూలై 14: శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కన్పించట్లేదు. రాత్రికి రాత్రి దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఒక్కో దేశం తిరుగుతున్నారు. తాజాగా ఆయన మాల్దీవుల నుంచి సౌదీఅరేబియాకు చెందిన సౌదియా ఎయిర్లైన్స్ విమానంలో సింగపూర్ వెళ్లారని తెలుస్తున్నది. విమానంలో గొటబయతో పాటు ఆయన భార్య లోమా, ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారని చెబుతున్నారు. అయితే ఆయనకు ఆశ్రయం కల్పించేందుకు తమ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సింగపూర్ స్పష్టం చేసింది. అసలు గొటబయ తమను ఆశ్రయం కల్పించాలని ఇప్పటివరకూ కోరనేలేదని వెల్లడించింది. కాకపోతే ఆయన ‘వ్యక్తిగత పర్యటన’ నిమిత్తం సింగపూర్లోకి అనుమతించామని సింగపూర్ అధికారులు తెలిపారు.
గొటబయ రాజీనామా..
గొటబయను అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ శ్రీలంక పార్లమెంటు స్పీకర్ మహింద యప అబేయవర్ధెన సూచించారు. దీంతో గురువారం రాత్రి గొటబయ రాజీనామా లేఖను స్పీకర్కు పంపినట్టు సమాచారం. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రధానిని ఎంచుకోవాలని స్పీకర్కు ప్రధాని విక్రమసింఘె విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు నూతన ప్రధాని పేరును ప్రతిపక్షాలు ప్రతిపాదిస్తాయని సమాచారం. అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఆర్మీ మాజీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ శరత్ ఫొన్సెకా ప్రకటించారు. నిరసనకారులు ప్రభుత్వ భవనాలను ఖాళీ చేస్తున్నారు. పాత పార్లమెంటు భవనం (అధ్యక్షుడి కార్యాలయం), గల్లె ఫేస్ ప్రాంతాన్ని ఖాళీ చేయబోమని స్పష్టం చేశారు. లంకలో నిరసనలను అణిచివేసేందుకు ఉక్కుపాదం మోపాలంటూ, అవసరమైతే కాల్పులు కూడా జరుపాలంటూ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులైన ప్రధాని రణిల్ విక్రమసింఘే ఆదేశాలను శ్రీలంక ఆర్మీ బేఖాతరు చేసింది.