కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో (Sri Lanka) ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఎమర్జెన్సీ (emergency) ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రిదాటిన తర్వాత గెజిట్ విడుదల చేశారు. ప్రజలకు రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, అత్యవసర సరుకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
దేశంలో గత కొన్ని రోజులుగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజుకు 13 గంటలకు పైగా కరెంటు కోత విధిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలకు దిగారు. గురువారం రాత్రి అధ్యక్ష భవనం ఎదుట నిర్వహించిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నారు. దీంతో మరుసటి రోజే ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.