Sri Lankan Economic Crisis | పర్యాటకులతో సందడిగా, సంతోషంగా ఉన్న ద్వీప దేశం అది. గత కొద్ది నెలలుగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నది. నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహావేశాలు శనివారం ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడగా.. శ్రీలంక మరోసారి రావణకాష్టంలా తయారైంది. రాజధాని కొలంబోలోని వీధులన్నీ ఆందోళనకారులతో కిక్కిరిసిపోయాయి. దీంతో అధికారాన్ని అంటిపెట్టుకుని ఉన్న అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాష్ట్రపతి భవన్ను వదిలి పారిపోవాల్సి వచ్చింది. భద్రత కోసం మోహరించిన వేలాది మంది సైన్యం, పోలీసు సిబ్బంది కూడా అక్కడి నుంచి
పారిపోవాల్సిన దుస్థితి.
అయితే, అధ్యక్షుడి పలాయణంతో ప్రజల ఆగ్రహావేశాలు కాస్త సద్దుమణిగాయి. పలువురు నిరసనకారులు మాట్లాడుతూ ఎంతోకాలంగా మార్పు కోసం ఎదురుచూస్తున్నామని, ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలపై పలువురు ఆందోళనకారులు మాట్లాడుతూ ఆకలితో అలమటించే పరిస్థితులే తమను వీధుల్లోకి తీసుకువచ్చాయని పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే సంకల్పంతోనే వీధుల్లోకి వచ్చామంటున్నారు. ఇంధనం లేక వాహనాలు నడుపలేకపోతున్నామని, అందరు పాదయాత్ర చేస్తూ నిరసన స్థలానికి చేరుకుంటున్నామన్నారు.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తనను, కుటుంబాన్ని తీవ్రంగా విచ్ఛిన్నం చేసింది’ అని ఓ నిరసనకారుడు తెలిపాడు. ఆరోగ్యం సరిగా లేక మందులపైనే ఆధారపడి జీవిస్తున్నానని, కానీ వాటిని ఇప్పుడు తీసుకోవడం మానేసినట్లు చెప్పాడు. తన పిల్లలు, భార్య సైతం నిరసనలో పాల్గొంటున్నారని చెప్పుకొచ్చాడు. అధ్యక్షుడు గోటబయ పారిపోయాడని, ఆర్థిక సంక్షోభంతో చీకట్లలోకి వెళ్లిన శ్రీలంకలో ఈ రోజు వేడుకల రోజు అని పేర్కొన్నాడు. ఇప్పుడు అందరు సంతోషంగా ఉన్నారన్నారు. శ్రీలంకలో స్వాతంత్ర్యం అనంతరం అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. విదేశీ మారకద్రవ్య నిల్వలు నిండుకున్నాయి. ఫలితంగా అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోలేని పరిస్థితి. పెట్రోల్, డీజిల్ కోసం కొన్ని కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లు ఉన్నాయి.
శ్రీలంకలో అధికారంలో ఉన్న రాజపక్స కుటుంబం కీలకమైన పదవులన్నింటిని గుప్పిట్లో ఉంచుకున్నది. మహింద రాజపక్స ప్రధాని అయ్యాక.. ఆయన సోదరుడు గోటయబను అధ్యక్షుడిగా, బాసిల్ రాజపక్స ఆర్థికమంత్రిగా, చమల్ రాజపక్స నీటిపారుదల, వ్యవసాయశాఖ మంత్రిగా, కొడుకు నమల్ రాజపక్స క్రీడామంత్రిగా నియమించారు. దేశ బడ్జెట్లో 70శాతం ఈ ఐదుగురి ఆధీనంలోనే ఉన్నది. దాదాపు రూ.45వేలకోట్లను విదేశాలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఈ మొత్తం 2021లో దేశం నుంచి ఎగుమతి చేసిన ఉత్పత్తుల విలువలో మూడింట ఒకటో వంతు ఉంటుందని అంచనా.
ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాలు రాజపక్స కుటుంబం తీసుకున్న నిర్ణయాలే. అనవసర ప్రాజెక్టుల కోసం మహింద రాజపక్స చైనా నుంచి 700 మిలియన్ డాలర్ల విలువైన రుణాలు తీసుకున్నారు. హంబన్ తోట ఓడరేవును 99 ఏళ్లపాటు చైనాకు ఇవ్వాల్సి వచ్చింది. అలాగే మహింద, గోటబయ తమిళులను క్రూరంగా అణచివేశారనే ఆరోపణలున్నాయి. ఆ వర్గం ఆర్థిక అభివృద్ధిని కూకటివేళ్లతో నరికివేశారనే విమర్శలున్నాయి. వ్యవసాయాన్ని సేంద్రీయంగా మార్చేందుకు రసాయన ఎరువులు వాడకాన్ని నిషేధించారు. దీంతో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పడిపోయాయి. ఇదిలా ఉండగా.. విదేశాల నుంచి డబ్బులు రాబట్టడంలో చమల్, నమల పాత్ర ప్రధానమైంది. మహింద సోదరుడైన ఆర్థిక మంత్రి బాలిస్ను ‘మిస్టర్ 10 పర్సెంట్’ అని పిలిచేవారు.
శ్రీలంకపై విదేశీ అప్పులు 12 ఏళ్ల క్రితమే పెరగడం మొదలైంది. చైనా, భారతదేశం, జపాన్, ఏడీబీ, ప్రపంచ బ్యాంకుతో సహా అనేక దేశాలు, సంస్థల రుణాలు చాలా పెరిగాయి. అవసరమైన వస్తువుల దిగుమతిని తగ్గించాల్సి వచ్చింది. దీంతో మందులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆహార పదార్థాల కొరతకు దారి తీసింది. డాలర్ క్రంచ్ కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. ఎందుకంటే దిగుమతుల కోసం చెల్లించాల్సి ఉండగా.. ఈ పరిస్థితులు శ్రీలంక రూపాయి విలువను తగ్గించాయి. మార్చి 1న శ్రీలంక రూపాయి డాలర్కు రూ.202 ఉండగా.. నేడు రూ.362.84కు చేరింది.
2019లో అధ్యక్షుడు గోటబయ ప్రజలను ఆకర్షించేందుకు పన్నులను తగ్గించడం ప్రారంభించారు. ఫలితంగా 2017లో 1095 మిలియన్ల డాలర్ల ఆదాయం ఉండగా.. 2020 నాటికి ప్రభుత్వ ఆదాయం 656 మిలియన్లకు డాలర్లకు తగ్గింది. శ్రీలంకలో ముఖ్యమైన ఆదాయ వనరు పర్యాటకం. ఈ పర్యాటకరంగం సైతం అనేక కారణాలతో నాశనమవుతూ వస్తున్నది. ఫలితంగా పర్యాటకులు రావడం మానేశారు. కరోనా అనంతర పరిస్థితులు మరింత సర్వనాశనం చేశాయి. 2018లో 23లక్షల మంది పర్యాటకులు శ్రీలంకను సందర్శించగా.. 2021 నాటికి భారీగా తగ్గింది.
ఆహార ధాన్యాల ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోవడంతో శ్రీలంకలో తీవ్రమైన ఆహార సంక్షోభం ఏర్పడింది. తృణధాన్యాలు, పప్పులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మధ్య తరగతి కుటుంబాలు ఖరీదైన ఆహార పదార్థాలను కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. దీంతో ఆహారాన్ని తీసుకోవడాన్ని తీసుకోవడాన్ని తగ్గించుకుంటున్నారు. ఇదే సమయంలో గ్యాస్ కొరతతో ఇండ్లల్లో కట్టెల పొయ్యిలను వినియోగించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. లీటర్ పెట్రోల్ దాదాపు రూ.500 వరకు చేరింది.
కొలంబోకు చెందిన ఆటో డ్రైవర్ తుషాన్ పేరీరా అనే వ్యక్తి మాట్లాడుతూ.. తన ముగ్గురు పిల్లలకు ఐదువారాల నుంచి రెండుపూటలా భోజనం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబం మొత్తం బిస్కెట్ ప్యాకెట్లపైనే ఆధారపడి ఉందని, దాని రేటు శ్రీలంక రూపాయిలో 130కి చేరిందని తెలిపాడు. పిల్లలకు ఉదయం అల్పాహారం అందించలేక మధ్యాహ్నం 12 గంటల వరకు నిద్రపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వాపోయాడు. రెండు రోజుల పాటు క్యూలైన్లలో ఉంటే ఐదు లీటర్ల పెట్రోల్ ఇస్తున్నారని, జూలై 22 వరకు ఇంధనం రాదని ప్రభుత్వం తెలిపిందని, పెట్రోల్ బ్లాక్ మార్కెట్లో రూ.550కి విక్రయిస్తున్నారని తెలిపాడు.
శ్రీలంకలో ఇంధక కొరత తీవ్రంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో వచ్చిన కొద్దిపాటి ఇంధనాన్ని పెట్రోల్ పంపుల్లో సైన్యం పర్యవేక్షణలో పంపిణీ చేస్తున్నారు. కిలోమీటర్ల పొడవున బారులు ఉండడంతో చివరికి కొందరికి దొరక్క పోవడంతో పోలీసులు, సైన్యంతో ప్రజలు ఘర్షణకు దిగుతున్నారు. ఇంధనం కొరత కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. కుటుంబ పరిస్థితులను చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో రోజు రోజుకు ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోతున్నది. మేలో 39.1 శాతం ఉన్న ద్రవ్యోల్బణం జూన్లో 54.6 శాతానికి పెరిగింది. ఒక్క ఆహార ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తే.. మేలో 57.4 శాతంగా ఉండగా.. జూన్లో 80.1 శాతానికి పెరిగింది. శ్రీలంక ద్రవ్యోల్బణం మొత్తం ఆసియాలోనే అత్యధికం.
శ్రీలంకలో నిరసనలు ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. దేశంలోని నలుమూలల నుంచి రాజధానికి నిరసనకారులు చేరుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి భవనం నిరసనకారుల ఆందోళనంలో ఉన్నట్లు తెలుస్తున్నది. అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన వేలమంది నిరసనకారులు శ్రీలంక జాతీయ పతాకాలను చేతబూని గొటబయకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కొందరు భవనంలోని స్విమ్మింగ్పూల్లో ఈత కొట్టగా.. మరికొందరు అధ్యక్ష భవనం కిచెన్లోకి ప్రవేశించి అక్కడి ఆహార పదార్థాలను తింటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.