కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో (Sri Lanka) మంత్రివర్గం రాజీనామా చేసింది. ఆదివారం అర్ధరాత్రి సమావేశమైన 26 మంది మంత్రులు తమ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రధాని మహింద రాజపక్సకు మూకుమ్మడిగా తమ రాజీనామా పత్రాలను అందించారు. దేశంలో సంక్షోభం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పధాని మహీంద రాజపక్స రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని ప్రధాని కార్యాలయం తిరస్కరించిన గంటల వ్యవధిలోనే తాము మంత్రి పదవుల నుంచి వైదొలుగుతున్నట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు.
ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినట్లు ఆదివారం రాత్రి వార్తలు వెలువడ్డాయి. అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు రాజీనామాను అందించినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే, ఈ వార్తలను ప్రధానమంత్రి కార్యాలయం కొట్టిపారేసింది. మహీంద రాజపక్స రాజీనామా చేయలేదని స్పష్టం చేసింది. అవి తప్పుడు వార్తలుగా పేర్కొంది.
కాగా, మంత్రివర్గం నుంచి తప్పుకున్న వారిలో ప్రధాని మహీంద రాజపక్స పెద్ద కుమారుడు నమల్ రాజపక్స కూడా ఉన్నారు. తాను తక్షణమే మంత్రివర్గం నుంచి తప్పుకుంటున్నట్లు నమల్ చెప్పారు. తన శాఖలకు రాజీనామా చేసిన విషయాన్ని అధ్యక్షుడికి తెలియజేశానన్నారు. తాను లంక ప్రజలకు, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటానని చెప్పారు. మహీంద రాజపక్స ప్రభుత్వంలో నమల్.. యువజన, క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు.