కొలంబో: ఆర్థిక సంక్షోభంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు నేడు నూతన పాలకులు రానున్నారు. ప్రజాగ్రహంతో మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స విదేశాలకు పారిపోవడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. ప్రధాని రణిల్ విక్రమసింఘె ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దీంతో లంక పార్లమెంటు నేడు నూతన అధ్యక్షుడు, ప్రధానమంత్రిని ఎన్నుకోనున్నది. కాగా, గత 44 ఏండ్లలో దేశాధ్యక్షుడిని పార్లమెంటు నేరుగా ఎన్నుకోనుండటం ఇదే మొదటిసారి.
అధ్యక్ష రేసులో దులస్ అలహాప్పెరుమాను, ప్రధాని పదవికి ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస ముందంజలో ఉన్నారు. అధికార ఎస్ఎల్పీపీ మెజార్టీ సభ్యులు ఇద్దరు నేతలకు మద్దతు తెలిపారు. కాగా, శ్రీలంక పార్లమెంటులో మొత్తం 225 మంది సభ్యులున్నారు. ఇందులో ఎస్ఎల్పీపీ బలం 101గా, ఎస్జేబీ బలం 50గా ఉంది. వామపక్ష పార్టీ జనతా విముక్తి పెరమున నాయకుడు అనూర కుమార దిశనాయకే కూడా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నా ఆయన గెలిచే అవకాశాలు దాదాపుగా లేవు.