కొలంబో: విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి, ద్రవ్యోల్బణం భారీగా పెరిగి, నిత్యావసరాలు కొండెక్కి సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ఇప్పుడు ఇండియా సాయం కోరింది. చమురు కొనడానికి 50 కోట్ల డాలర్లు ఇవ్వాలని అభ్యర్థిస్తోంది. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న చమురు వచ్చే జనవరి వరకు మాత్రమే సరిపోతుందని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్మన్పిలా ఈ మధ్యే చెప్పిన నేపథ్యంలో శ్రీలంక ఈ సాయం కోరింది. అక్కడి ప్రభుత్వ రంగ సంస్థ సీలోన్ పెట్రోలియం కార్పొరేషన్.. ప్రధాన ప్రభుత్వ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ సీలోన్, పీపుల్స్ బ్యాంక్లకు సుమారు 330 కోట్ల డాలర్లు బాకీ పడింది. మధ్యప్రాచ్య దేశాలు, సింగపూర్ నుంచి శ్రీలంక ఆయిల్ కంపెనీలు చమురును దిగుమతి చేసుకుంటాయి.
ఇప్పుడు ఇండియా, శ్రీలంక ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద 50 కోట్ల డాలర్లు ఇవ్వాలని కోరామని, దీనికోసం ప్రస్తుతం ఇండియన్ హైకమిషన్తో మాట్లాడుతున్నట్లు సీపీసీ చైర్మన్ సుమిత్ విజేసింఘె తెలిపారు. ఈ డబ్బుతో పెట్రోల్, డీజిల్ కొంటామని చెప్పారు. ఈ అప్పుపై త్వరలోనే ఇండియా, శ్రీలంక ఇంధన శాఖ కార్యదర్శులు త్వరలో ఒప్పందం చేసుకోనున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో శ్రీలంక దిగుమతి ఖర్చులు తడిసి మోపెడయ్యాయి.