కొలంబో : పొరుగు దేశంలో శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. ఈ క్రమంలో లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 17 మంది మంత్రులకు స్థానం కల్పించారు. మరో వైపు మంగళవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజపక్సపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని విపక్షాలు నిర్ణయించాయి. ఇవాళ కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ ఏఎన్ఐకి తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ప్రధానమంత్రి మహింద రాజపక్స పాల్గొంటారని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో నెల మొదటివారంలో కేబినెట్ రాజీనామా చేసింది. ఆ తర్వాత అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అధ్యక్షుడు పిలుపునివ్వగా.. విపక్షాలు నిరాకరించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిరసనకారులు అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ప్రధాని, అధ్యక్షుడు పదవులకు రాజీనామా చేయాలని ప్రజలతో పాటు విపక్షాలు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీలంక విదేశీ మారకద్రవ్యం కొరతను ఎదుర్కొంటున్నది. దీంతో ఆహారం, ఇంధనం దిగుమతులను ప్రభావితం చేసింది. నిత్యవసరాల కొరతను అధిగమించేందుకు శ్రీలంక మిత్రదేశాలను సహాయం కోరింది. మరోవైపు, ప్రధాని మహింద రాజపక్స జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రజలంతా ఓపికగా ఉండాలని, వీధుల్లోకి రావొద్దని అభ్యర్థించారు.