NationWide Curfew in Sri Lanka | సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు దేశవ్యాప్త కర్ఫ్యూ విధిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు గోటబయా రాజపక్సె ప్రకటించారు. రోజురోజుకు ఆందోళనలతో పరిస్థితి విషమిస్తుండటంతో అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు శ్రీకారం చుట్టారు. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ప్రతినిధులతో ఆదివారం చర్చలు జరిపారు. శ్రీలంకకు భారత్ నాలుగు లక్షల టన్నుల డీజిల్తో కూడిన నౌక పంపిన రోజే ఈ చర్చలు జరిగాయి.
1848 తర్వాత శ్రీలంక దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. విదేశీ మారక ద్రవ్య నిధులు తక్కువగా ఉండటంతో ప్రజలు పెట్రోల్, కుకింగ్ గ్యాస్, ఇతర నిత్యావసరాల కోసం భారీగా క్యూలైన్లలో నిలుచోవాల్సి వస్తున్నది. నిత్య విద్యుత్ కోతలు, ఆహార ధాన్యాల ధరల పెరుగుదలతో ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఆర్థిక సంక్షోభం తిరిగి రాజకీయ సంక్షోభం దిశగా ప్రయాణిస్తున్నది. రాజపక్సెలు రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటున్నది.