అడుగంటిన విదేశీ మారక నిల్వలు
రుణ ఎగవేత ప్రకటించిన ప్రభుత్వం
విదేశీ రుణాలు చెల్లించలేమని వెల్లడి
ఐఎంఎఫ్ ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు
కొలంబో, ఏప్రిల్ 12: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక దివాలా దిశగా వెళ్తున్నది. దేశంలో విదేశీ మారక నిల్వలు ఇప్పటికే అడుగంటాయి. దీంతో విదేశాల నుంచి తీసుకున్న అప్పులను ప్రస్తుతానికి కట్టలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఈ మేరకు ప్రకటించింది. ‘సాధారణ రుణ సేవలను నిలిపేస్తున్నాం. ఇది 2022, ఏప్రిల్ 12 వరకు ఉన్న రుణాల మొత్తాలకు వర్తిస్తుంది’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నది. విదేశాల నుంచి తీసుకున్న 5,100 కోట్ల డాలర్ల (సుమారు రూ.3.88 లక్షల కోట్లు) అప్పులను ప్రస్తుతానికి కట్టలేమని స్పష్టం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారకుండా నివారించేందుకు చివరి ప్రయత్నంగా ఈ అత్యవసర చర్య తీసుకుంటున్నట్టు పేర్కొన్నది.
ఐఎంఎఫ్ ప్యాకేజీపై ఆశలు
ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) ఉద్దీపన ప్యాకేజీలపై శ్రీలంక అశలు పెట్టుకున్నది. ఐఎంఎఫ్ నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇంకా పెండింగ్లో ఉన్నదని, ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన తాజా చర్య తీసుకున్నట్టు శ్రీలంక సెంట్రల్ బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న డాలర్లతో అప్పులు కడితే.. ఆహార గింజలు, ఇతర నిత్యావసరాల దిగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
కొనసాగుతున్న నిరసనలు
ఆర్థిక సంక్షోభాన్ని నివారించడంలో విఫలమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొలంబోలోని గల్లేఫేస్ మైదానంలో జరిగిన ఆందోళనల సందర్భంగా ప్రజలను ఉత్సాహపరుస్తూ ప్రముఖ రాప్ సింగర్ శ్రీరాజ్ గుండెపోటుతో మరణించారు. దేశంలో నెలకొన్న ఔషధాల కొరతను అధిగమించేందుకు సహకరించాలని శ్రీలంక ప్రభుత్వ వైద్యుల సంఘాలు కోరాయి. మందులు, ఇతర అవసరమైన వస్తువులు విరాళాలుగా ఇవ్వాలని కోరుతూ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ అసోసియేషన్ (జీఎంఓఏ) ఒక పోర్టల్ను ప్రారంభించింది.
సంక్షోభానికి అనేక కారణాలు
శ్రీలంక ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చేందుకు ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో చారిత్రక అసమానతలు, ఐఎంఎఫ్ నయాఉదారవాద విధానాల అమలు, ప్రభుత్వం రైట్ వింగ్ చేతుల్లోకి పోవడం, పాలన కేంద్రీకృతం కావడం వంటి అనేక పరిణామాలు తోడయ్యాయని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొన్ని షరతులతో శ్రీలంకకు ఐఎంఎఫ్ రుణం ఇచ్చే అవకాశం కనిపిస్తున్నది. కఠినమైన ఆర్థిక, ద్రవ్య విధానాలతో పాటు వ్యాట్ రేట్లను కూడా పెంచాల్సి రావొచ్చని ఐఎంఎఫ్ ఇప్పటికే సూచించింది. దీని వల్ల నయాఉదారవాద విధాన చట్రంలో శ్రీలంక మరితంగా ఇరుక్కుపోయే ప్రమాదం ఉన్నదని చెబుతున్నారు.