Sri Lanka Crisis | పొరుగు దేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. విదేశీ మారకద్రవ్యం అడుగంటడంతో అల్లాడుతున్నది. ద్యవ్యోల్బణం పతాక స్థాయికి చేరడంతో జనం ఆకలికి అలమటించాల్సిన దుస్థితి ఎదురైంది. దేశంలో దాదాపు 60లక్షల మందికిపైగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, ప్రస్తుతం 30లక్షల మంది ఆకలి తీర్చేందుకు రూ.500కోట్లు (భారతీయ కరెన్సీలో) అవసరమని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) పేర్కొంది. ప్రస్తుతం శ్రీలంక దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నేషనల్ (శ్రీలంక) చీఫ్ అబ్దుర్ రహీమ్ తెలిపారు.
రాబోయే కొద్ది నెలల్లో ఆహార సంక్షోభం తీవ్రంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ అధ్యయనం ప్రకారం.. జనాభాలో నాలుగింట ఒకటో వంతు అంటే.. 5.3 మిలియన్ల మంది ప్రజలు ఆహారం తీసుకోవడాన్ని తగ్గిస్తున్నారు. కొందరు ఒక పూటమానివేయడం, తమ కుటుంబంలోని చిన్న పిల్లలకు ఆహారాన్ని ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న ఆహార సంక్షోభం నెలకొన్న పరిస్థితుల మధ్య.. ఈ ఏడాది చివరి నాటికి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కు రూ.500కోట్లకుపైగా అవసరమవుతాయని.. అయితే, అవి కేవలం 30శాతం మంది ప్రజల ఆకలిని మాత్రమే తీర్చగలదని అబ్దుర్ రహీమ్ పేర్కొన్నారు.