Sri Lanka Crisis | ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పొరుగు దేశంలో శ్రీలంకలో ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతి భవన్ను స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మార్పు కోసం సమయం ఆసన్నమైందంటూ నినదిస్తున్నారు. ఈ క్రమంటో జూలై 13న రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయనున్నట్లు గోటబయ రాజపక్స ప్రకటించారు. పెరుగుతున్న హింస నేపథ్యంలో ప్రధాని రణిల్ విక్రమ సింఘే ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే, రాష్ట్రపతి గోటబయ నివాసంలో నిరసనకారులు కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయాన్ని స్థానిక మీడియా తెలిపింది. నిరసనకారులు స్వాధీనం చేసుకున్న సొత్తును భద్రతా సిబ్బందికి అప్పగించినట్లు డైలీ మిర్రర్ పేర్కొంది. నగదుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అందులో ఓ నిరసనకారుడు కరెన్సీ నోట్లను లెక్కిస్తున్నట్లు కనిపించాడు. ఆ నోట్ల కరెన్సీ అధ్యక్షుడి అధికారిక నివాసం నుంచి తీసుకొచ్చినట్లు నిరసనకారులు పేర్కొన్నారు. అయితే, ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాకే నిజానిజాలు తెలుస్తాయని, సరైన ఆధారాలతో సమాచారం అందిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీలంకకు మద్దతు ఇస్తున్నామని, సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని, ఇప్పటి వరకు శరణార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం ఓ ప్రకటన విడుదల చేశారు. తీవ్రమైన సంక్షోభం సమయంలో శ్రీలంక, ప్రజలకు కాంగ్రెస్ సంఘీభావం ప్రకటిస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే ప్రస్తుత పరిస్థితులను అధిగమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇబ్బందిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత ప్రభత్వుం సహాయం కొనసాగిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా.. ప్రధాని విక్రమ సింఘే వ్యక్తిగత నివాసానికి నిప్పంటించిన కేసులో ముగ్గురు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.