Sri Lanka Crisis | ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని అల్లాడుతున్న శ్రీలంకను గట్టెక్కించేందుకు అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో లంక ప్రభుత్వం నిర్ణయంపై క్రీడాకారులతో పాటు అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు ఏమాత్రం ఆలోచించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ ఆరోపిస్తున్నారు. లంక ప్రభుత్వం ఇటీవల పెద్ద ఎత్తున ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం విధించింది. ఈ జాబితాలో పలు రకాల బంతులూ ఉన్నాయి. బంతులపై నిషేధం విధించడంతో క్రీడాకారులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే, ఈ నెల 23న మంత్రివర్గం బంతుల దిగుమతిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ప్రకారం గోల్ఫ్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడల్లో ఉపయోగించే బంతులను దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కానీ, క్రికెట్, లాన్ టెన్నిస్, ఫుట్బాల్, రగ్బీ బంతుల దిగుమతిపై నిషేధం విధించింది. క్రీడాకారులతో పలువురు వక్తలు సైతం ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. గోల్ఫ్ బంతి దిగుమతికి ఎందుకు మినహాయించారని ప్రశ్నించారు. గోల్ఫ్ను కేవలం సంపన్నులు ఆడటానికేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలను ఆదా చేసేందుకు దిగుమతులపై ఆంక్షలు కఠినతరం చేయాలని శ్రీలంక సెంట్రల్ బ్యాంకు ఇంతకు ముందు ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
అయితే, దీనికి సంబంధించి లేవనెత్తిన ప్రశ్నలపై ఆర్థిక మంత్రిత్వశాఖ గానీ, సెంట్రల్ బ్యాంకు గానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. గోల్ఫ్తో ముడిపడి ఉన్న స్వార్థ ప్రయోజనాలు, లాబీయింగ్ కారాణంగా ప్రభావితం కాలేదని స్థానిక మీడియా పేర్కొంది. సెంట్రల్ బ్యాంక్ ఉన్నత అధికారులంతా గోల్ఫ్ ప్రేమికులని, ఆ అధికారులు చాలా మంది ప్రతి రోజూ కొలంబోలోని ఓ గోల్ఫ్ క్లబ్లో కనిపిస్తారని ఆరోపించింది. మరో నిషేధం నిర్ణయం టెన్నిస్, బ్యాట్మింటన్తో సహా పలు క్రీడల్లో వినియోగించే రాకెట్ల దిగుమతికి సైతం విధించనున్నది. మరో వైపు దిగుమతిపై ఆంక్షలు వాహనాలు, యంత్రాల్లో వినియోగించే బాల్స్కు సైతం వర్తిస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో పాటు వాహనాలు, యంత్రాల్లో ఉపయోగించే స్క్రూల దిగుమతిపై సైతం ప్రభుత్వం ఆంక్షలు విధించింది.