Diamond Dust | న్యూయార్క్, అక్టోబర్ 22: పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి భూమికి రక్షణ కల్పించేందుకు డైమండ్ డస్ట్ను ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు కొత్త ప్రతిపాదన చేశారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘జియోఫిజికల్ రిసెర్చ్ లెటర్స్’లో ప్రచురితమయ్యాయి. ప్రతియేటా 50 లక్షల టన్నుల డైమండ్ డస్ట్ను భూమి ఎగువ వాతావరణంలో వెదజల్లాలని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. తద్వారా భూమిపై 1.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తగ్గించవచ్చని తెలిపారు. డైమండ్ డస్ట్ను భూమి ఎగువ వాతావరణంలో వెదజల్లితే అది అద్దంలా పని చేస్తుందని, భూమిపై పడాల్సిన సూర్యకిరణాలను అడ్డుకొని, తిరిగి అంతరిక్షంలోకే ప్రతిబింబించేలా చేస్తుందని చెప్పారు.
ఇలా అంతరిక్షంలో ఏవైనా పదార్థాలను వెదజల్లి సూర్యకిరణాలను అడ్డుకొని, భూమిపై వాతావరణాన్ని తగ్గించే ప్రక్రియను సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్(ఎస్ఆర్ఎం) అంటారు. గతంలో ఎస్ఆర్ఎం కోసం సల్ఫర్, కాల్షియం, అల్యూమినియం, సిలికాన్ వంటి వాటిని వినియోగించవచ్చని పలు ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే, ఇందుకోసం డైమండ్ డస్ట్ మెరుగ్గా పని చేయగలదని తాజాగా శాస్త్రవేత్తలు తెలిపారు.