కేప్ కానావెరల్(అమెరికా), సెప్టెంబర్ 16: అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రోదసి ప్రయోగాల్లో ఎలాంటి అనుభవంలేని నలుగురు పౌరులను ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’ తొలిసారిగా నింగిలోకి పంపించింది. వీరు మూడు రోజుల పాటు భూకక్ష్యలో ప్రయాణించనున్నారు. ‘ఇన్స్పిరేషన్ 4’ పేరుతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 8.02 గంటల ప్రాంతంలో ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ‘స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9’ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు 12 నిమిషాల తర్వాత డ్రాగన్ కాప్సుల్ రాకెట్ నుంచి వేరవడంతో వాహకనౌక భూకక్ష్యలోకి చేరింది. అనంతరం ఈ ప్రాజెక్టు విజయవంతమైనట్టు స్పేస్ఎక్స్ ప్రకటించింది. కాప్సుల్లోని వ్యోమగాములు మూడు రోజుల పాటు భూమి చుట్టూ ప్రయాణించి.. తిరుగు ప్రయాణమవుతారని తెలిపింది. స్పేస్ఎక్స్ కంటే ముందు వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ సంస్థలు కూడా అంతరిక్ష పర్యాటకాన్ని ఇటీవలే ప్రారంభించాయి. అయితే, ఈ పర్యటనలు ఐఎస్ఎస్ వరకే పరిమితమయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే ముగిశాయి. అయితే, ‘ఇన్స్పిరేషన్ 4’ ప్రయోగం భూకక్ష్య వరకూ వెళ్తూ.. మూడు రోజుల పాటు కొనసాగుతుండటం విశేషం.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్), హబుల్ టెలిస్కోప్ను దాటుకొని భూమి నుంచి 575 కిలోమీటర్ల ఎత్తులో ‘ఇన్స్పిరేషన్ 4’ వ్యోమగాముల పర్యటన కొనసాగనున్నది. ‘ఇన్స్పిరేషన్ 4’ ప్రయోగ ఖర్చులన్నింటినీ అమెరికా కోటీశ్వరుడు, ‘షిఫ్ట్4పేమెంట్స్’ కంపెనీ సీఈవో జేర్డ్ ఐసాక్మాన్ భరిస్తున్నారు. ఆయన కూడా ‘ఇన్స్పిరేషన్ 4’లో భాగమయ్యారు. ఈ ప్రయోగం స్ఫూర్తివంతమైనదిగా చెప్పాలి. కేన్సర్ బారినపడి కోలుకున్న వ్యక్తి, అమెరికా వాయుసేనలో సేవలందించి పదవీవిరమణ చేసిన మరో వ్యక్తి, భూగర్భ శాస్త్రవేత్త, ఓ కోటీశ్వరుడు ఇలా భిన్న నేపథ్యాలున్న వ్యక్తులు ‘స్పేస్ఎక్స్’ వ్యోమనౌకలో ప్రయాణిస్తున్నారు.